బేగంపేట్ ( హైదరాబాద్ ) : శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమైందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Minister Talasani ) అన్నారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో పోలీస్ అధికారులతో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన చాంబర్లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలలో సీసీ కెమెరాల ( CC Cameras ) ఏర్పాటు కోసం తన అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కోటి యాభై లక్షలు రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. వంద మంది పోలీసులు చేయగల పనిని ఒక్క సీసీ కెమెరా చేస్తుందని అన్నారు. దేశంలోనే అత్యధిక కెమెరాలను ఏర్పాటు చేసిన నగరంగా హైదరాబాద్ ( Hyderabad ) కు గుర్తింపు ఉన్నదని పేర్కొన్నారు .
నగరంలోనే అత్యధిక సీసీ కెమెరాలను సనత్నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నూటికి నూరు శాతం సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాల పనితీరును కూడా తరచూ పర్యవేక్షిస్తుండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ గజారావు భూపాల్, ఐటీ విభాగం ఏసీపీ చాంద్ పాషా, ఇన్స్పెక్టర్ విశాల్, ఉత్తర మండలం డీసీపీ చందనదీప్తి, ఏసీపీలు పాల్గొన్నారు.