హైదరాబాద్ : అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఈ నెల 22 వ తేదీన నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Minister Talasani ) పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్ లో హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ నెల 22 వ తేదీన దశాబ్ది ఉత్సవాలు ముగుస్తాయని అన్నారు. అదేరోజు అమరవీరుల జ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR) ప్రారంభిస్తారని చెప్పారు. అంతకు ముందు నగరంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో మోటార్ సైకిళ్ల పై ర్యాలీ(Bike Rally) గా బయలు దేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు సాయంత్రం 4 గంటల వరకు చేరుకోవాలని సూచించారు. అక్కడి నుండి కళాకారులు, డప్పు చప్పుళ్ళ తో ర్యాలీగా అమరవీరుల జ్యోతి వద్దకు చేరుకోవాలని అన్నారు.
ముఖ్యమంత్రి అమరవీరుల జ్యోతిని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సభ ముగిసిన అనంతరం అందరిని ఎంతో అబ్బురపరిచే డ్రోన్ షో జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, వివేక్, సుభాష్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, సుదీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.