రవీంద్రభారతి,మార్చి 4: రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలు అమలుచేస్తున్నారని, మహిళా సంక్షేమం, భద్రత, రక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబిత్రాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో మహిళా దినోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పలువురు మహిళా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… మహిళలు మహారాణులై, అన్నిరంగాల్లో అద్భుతాలు సృష్టించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం 53 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేశారని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నాలుగు పారిశ్రామికవాడలను నెలకొల్పారని వివరించారు.
నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, చిన్నచిన్న సంఘటనలు జరుగుతుండటం బాధాకరమని చెప్పారు. అందరిలోనూ మార్పు రావాలని, అప్పుడే మహిళాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రత కోసం షీటీమ్లు, గర్భిణుల కోసం కేసీఆర్ కిట్స్, అమ్మఒడి లాంటి పథకాలు ప్రవేశపెట్టి, అండగా నిలుస్తున్నారని వివరించారు. ఈ వేడుకల్లో స్త్రీ,శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్, మహిళా కమిషన్ డైరెక్టర్లు ఈశ్వరీబాయి, జీ పద్మ, కొమ్ము ఉమాదేవి, కే రేవతి తదితరులు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని, ఫలితంగా తెలంగాణ మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి మాతృత్వం పొందే వరకు ప్రతి దశలో సీఎం కేసీఆర్ అమ్మగా, అన్నగా, మేనమామగా అండగా నిలుస్తున్నారని వివరించారు.ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించే కేసీఆర్ మహిళాబంధు కార్యక్రమంలో ప్రతి మహిళ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే హరిప్రియనాయక్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని, నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా ఉండటం మహిళలకు సీఎం కేసీఆర్ ఇస్తున్న గౌరవానికి నిదర్శమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహిళల భద్రత, రక్షణ విషయంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒంటరి మహిళల కన్నీరు తుడిచిన మనసున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో బీడీ కార్మికులకు పింఛన్ అమలవున్నదని వివరించారు.