హైదరాబాద్ : మహిళలు ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతిక ప్రతీక అని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఏకం చేసిన పండుగని గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి, అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. పండుగను అందరూ సంతోషంగా జరుపుకునేందుకు చీరెలను సైతం కానుకగా ఇస్తున్నారన్నారు. ఈ ఏడాది రూ.333కోట్లతో 289 డిజైన్లలో దాదాపు కోటి మందికి చీరెలు అందిస్తున్నారన్నారు. కొవిడ్ నేపథ్యంలో పండుగను వీలైనంత వరకు ఇండ్ల వద్దనే ఉండి జరుపుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.