హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణకు పునాదులు వేయాలని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవవరుల అభివృద్ధి సంస్థ భవనంలో జరిగిన పోషణ మాసం ముగింపు వేడుకల్లో సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పోషకాహార బోనం ఎత్తుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పోషకాహారంలో దేశానికి రోల్ మోడల్గా ఉంటూ ఆరోగ్య తెలంగాణ సాధించాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా పని చేయాలన్నారు. మహిళల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకం అమలు చేస్తున్నారన్నారు. అధికారులు, ఉద్యోగులుగా కాకుండా బాధ్యతగా పని చేయడం ద్వారా పోషకాహారాన్ని నివారించగలమన్నారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రతి ఇంటిలో న్యూట్రి గార్డెన్ ఏర్పాటు చేసుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు.
తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని, అంగన్వాడీలు కూడా మోడల్గా నిలువాలని సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పిలుపునిచ్చారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లు గడిచాయని.. ఇకపై మన దగ్గర పోషకాహార లోపం అనే పదం వినిపించకూడదన్నారు. పోషకాహార లోపం లేని తెలంగాణ కావాలన్నారు. ఇదే మన గీతం.. నినాదం కావాలన్నారు. ‘ఎలాంటి పోషకాహారాన్ని తినాలి’ అని ‘యూనిసెఫ్ వచ్చి మనకు నేర్పించాలా?.. 1975లో పుట్టిన ఐసీడీఎస్ శాఖ ఎన్నో సాధించింది.
ఇంకెంత కాలం మనం ఇతరుల నుంచి నేర్చుకుందాం. మన నుంచి నేర్చుకునేలా మనం తయారు కావాలి. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండడం అనేది మనకు గర్వ కారణం కావాలి’ అన్నారు. కార్యక్రమంలో ఆలనా, పాలనా వీడియోలు, పోషకాహర లోప నివారణ చైతన్యం కల్పించే పోస్టర్లు, బాలామృతం ప్లస్ ప్యాకెట్లు విడుదల చేశారు. కార్యక్రమానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి దివ్య దేవరాజన్ అధ్యక్షత వహించారు. యునిసెఫ్ ప్రతినిధులు మీటెల్ రస్డియా, డాక్టర్ ఖ్యాతి తివారి, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, ఎన్ఐఎన్, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖ, మిషన్ భగీరథ శాఖల అధికారులు పాల్గొన్నారు.