హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండాలన్న ఆకాంక్షతోనే తెలంగాణ మహిళా వర్సిటీని ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహిళా వర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ విద్యార్థుల కల సాకారమయ్యిందని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం మరింత పెరిగిందని చెప్పారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం లోగోను మంత్రి విడుదల చేశారు. సరికొత్తగా రూపొందించిన లోగోను ప్రత్యేకతలను తెలుసుకొన్న మంత్రి, వర్సిటీ అధికారులను అభినందించారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని, వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ రూపొందించాలని ఈ సందర్బంగా అధికారులను మంత్రి ఆదేశించారు. బోధనా సౌకర్యాలు, విద్యార్థినులకు కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్ యాదవ్, తెలంగాణ మహిళా వర్సిటీ ఇంచార్జి వీసీ విజ్జులత పాల్గొన్నారు.