ఖమ్మం, అక్టోబర్ 24 : ఖమ్మం నగరంలోని త్రీటౌన్ పరిధిలో గల గోళ్లపాడు చానల్(Gollapadu channel)లో అవినీతి జరిగిందంటున్న మీరు ఇన్నేళ్లు నోరెందుకు మూసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినందున అవినీతి జరిగిందంటున్నారు. దమ్ముంటే నిరూపించాలి. గోళ్లపాడు చానల్లో జరిగింది అవినీతి కాదు. అభివృద్ధి అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada )ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. అభివృద్ధి జరిగిందని ఒప్పుకోవడానికి మనసు రాక ఇలా నిందలు వేస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.
ఖమ్మం నగరం 28వ డివిజన్ ప్రకాశ్ నగర్లో కోడి లింగయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొని ప్రసంగించారు. నాడు జై తెలంగాణ అంటే కన్నెర్రజేసి ఉద్యమకారులపై లాఠీ దెబ్బల వర్షం కురిపించిన ఘనత కాంగ్రెస్ నాయకులదని అన్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకునేందుకు ఇళ్లలో జొరబడి బలవంతంగా కండువాలు కప్పి.. ఫొటోలు వాట్సాప్లలో పెట్టి మద్దతు తెలిపిండని అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.
ప్రకాశ్ నగర్కు కాంగ్రెస్ అభ్యర్థి గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్కసారైనా వచ్చాడా చెప్పాలన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో అనేకమార్లు ఇకడి ప్రజలను కలిసిన.. ప్రతి కార్యక్రమానికి వచ్చా.. వాళ్లు ఏనాడైనా వచ్చారా.. చెప్పాలన్నారు. కరోనా ఉగ్రరూపం దాల్చిన సమయంలో ప్రతి డివిజన్లో తిరిగి ప్రజల క్షేమ సమాచారం తెలుసుకుని, వారికి కావాల్సిన ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజెక్షన్లు, మందులు, నిత్యావసర సరుకులు, ఐసీయూలో బెడ్లు ఇలా అనేకం సమకూర్చామన్నారు.
ఇప్పటివరకు కోట్లాది రూపాయల వ్యయంతో చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందే ఉంది. మళ్లీ మమ్మల్ని ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అందరూ ఓటు వేసి గెలిపించాలని పువ్వాడ కోరారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీ వెంకన్న, పల్లా కిరణ్, తొట్టి ఎల్లయ్య, ముత్యాల వెంకయ్య, గజ్జెల నవీన్ తదితరులు పాల్గొన్నారు.