హైదరాబాద్: ఖమ్మంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ఆవిర్భావ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కిరణ్ కుమార్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం చరిత్రలోనే అత్యంత భారీసభ నిర్వహించినట్లు చెప్పారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సభను విజయవంతం చేసిన అందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తమకు మార్గనిర్దేశం చేసిన మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
‘ఖమ్మంలో బీఆర్ఎస్ మొదటి సభ విజయవంతమైంది. లౌకిక శక్తులు ఒకే వేదికపైకి వచ్చాయి. ఖమ్మం జిల్లాకు నిధుల వరద పారించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఖమ్మం అభివృద్ధికి గుమ్మంలా మారింది. కాంగ్రెస్ను ఓడించడానికి సుపారీలు అవసరం లేదు.. వాళ్ల నేతలే చాలు. సభ ప్లాప్ అయ్యిందని అంటున్న బండి సంజయ్.. కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకుంటే మంచిది. లేదంటే మేమే ఓ టీంను పంపిస్తాం. సభతో దేశ రాజకీయాలే కాదు ఖమ్మం రాజకీయాలు కూడా మారుతాయి’ అని పువ్వాడ అన్నారు.
ఖమ్మం సభ ఆరంభం మాత్రమే అని ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
ఇది మరిచిపోలేని సభ అని, కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన సభ అని చెప్పారు. 2001లో కరీంనగర్లో నిర్వహించిన సభ తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసినట్టు.. ఖమ్మం సభ జాతీయ రాజకీయాల్లో మార్పులకు నాంది కానుందన్నారు. ప్రగతి శీల శక్తుల కలయికకు ఖమ్మం సభ బాటలు వేసిందని పేర్కొన్నారు. దేశ సంపదను ఇద్దరు గుజరాతీలు మరో గుజరాతీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ రంగాన్ని కూడా ఆదానీకి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని.. దీన్ని కూడా ఉద్యోగులతో కలిసి ప్రతిఘటిస్తామని వెల్లడించారు. రైతుల ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రబలమైన శక్తిగా మారడానికి ఖమ్మం సభ బాటలు వేయబోతోందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మం సభతో బీజేపీకి జిల్లాలో స్థానం లేదని తేలిపోయిందన్నారు. బీజేపీకి ఖమ్మం లో డిపాజిట్లు కూడా రావు అని అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ పదికి పది స్థానాలు రావడం ఖాయమని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు.