ఖమ్మం, నవంబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలకు ఏం చేశారో చెప్పని నేతలను ప్రజలు నమ్మరని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఉమ్మడి జిల్లాలో నెలకొన్న రాజకీయాలు, గెలుపుపై సాధ్యాసాధ్యాలను గురువారం ‘నమస్తే’ చిట్ చాట్లో పంచుకున్నారు. విజిటింగ్ నేతలకు కాలం చెల్లిందని, కేవలం ఎన్నికల సమయంలో కనిపించే నేతలెవరో ప్రజలు గ్రహించారని స్పష్టం చేశారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి తన గెలుపును ఆపడం ఎవరితరం కాదన్నారు. రాజకీయాల్లో విలువలు లేకుండా కొందరు వ్యవహరిస్తున్నారని, ఖమ్మం ప్రజలు వారి ఆటలను ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వరన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి, అహంకారానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు నియోజకవర్గం నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారిగా తనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు.
తన హయాంలో గోళ్లపాడు చానల్ ఆధునీకరణ, ఐటీహబ్, ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ కమిషనరేట్ పనులు పూర్తి చేశానన్నారు. మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ వాల్స్, నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు తెచ్చానన్నారు. సీతారామ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తయితే ఉభయ జిల్లాల్లోని 10 నియోజకవర్గాలు సస్యశ్యామలవుతాయన్నారు. గోదావరి జలాలను పాలేరుకు తరలించి కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేస్తామన్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రతిపక్ష నేతలు చేస్తున్న పసలేని ప్రసంగాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రెండు జిల్లాల పరిధిలోని పదికి పది నియోజకవర్గాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడోసారి ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితీరుతారన్నారు.
నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీ ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నారని, ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్ హయాంలో ఏం మేలు జరిగిందో, ఎవరు అభివృద్ధిని అడ్డుకున్నారో ప్రజలకు క్షుణ్ణంగా తెలుసునన్నారు. ఎన్నికల ప్రచారం ఎవరిది వారు చేసుకోవడంలో అభ్యంతరం లేదని, కానీ ఉభయ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలు జయప్రదమయ్యాయని, సభలు పార్టీ కార్యకర్తలు, నేతల్లోనూ నూతనోత్సాహం నింపాయన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భద్రాద్రి జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలకు ప్రజాదరణ లభించిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటనలతో బీఆర్ఎస్కు పదికి పది సీట్లు సాధిస్తామని ధీమా వచ్చిందన్నారు.
నియోజకవర్గంలో చేసి అభివృద్ధిని మాత్రమే తాను ప్రచారంలో వివరిస్తున్నానని, సాధ్యం కాని వాగ్దానాలెప్పుడూ తాను చేయలేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, తన ఇంటి తలుపు తట్టే చనువు నియోజకవర్గ ప్రజలకు ఉందన్నారు. తాను పిలిస్తే పలికే వ్యక్తినన్నారు. ప్రజలు తనను తమ ఇంటి బిడ్డగానే భావిస్తారన్నారు. కరోనా సమయంలో తాను ప్రజలు అందించిన సేవలు వారిని తన వారిని చేశాయన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో ప్రజల వెంటే ఉన్నానన్నారు. వారికి వైద్యం అందించేందుకు ఖమ్మం ప్రధానాసుపత్రిని ఆధునీకరించామన్నారు. అవసరానికి తగినంత ఆక్సిజన్ నిల్వలు ఉండేలా చూశానన్నారు.