Minister Ponnam | చేర్యాల, మార్చి 24: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్కు భక్తుల నుంచి నిరసన సెగ తాకింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న సమయంలో 10వ ఆదివారం కావడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే రోజున మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం మంత్రి పొన్నం గర్భాలయానికి వెళ్లిన సమయంలో ఆలయవర్గాలు దర్శనాల క్యూలైన్లను నిలిపివేశాయి.
మంత్రి తన కుటుంబసభ్యులతో కలిసి మల్లన్నకు మొక్కులు చెల్లించుకునే వరకు దాదాపు గంట సమయం పట్టింది. అప్పటి వరకు క్యూలైన్లలో ఉన్న భక్తులు అసహనానికి గురయ్యారు. పూజల అనంతరం పట్నం వేసుకునేందుకు మహామండపానికి వస్తున్న మంత్రిని చూసి భక్తులు ‘మినిస్టర్’ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆలయ ఏఈవో బుద్ధి శ్రీనివాస్ ‘అయిపోయింది.. అయిపోయింది’ అంటూ భక్తులకు చేతులు చూపిస్తూ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికీ వ్యతిరేక నినాదాలు కొనసాగుతుండటంతో ఆలయ కమిటీ సభ్యులు కొందరు కొమురవెల్లి మల్లన్నకు జైజై అంటూ.. భక్తులు చేస్తున్న వ్యతిరేక నినాదాలు ఇతరులకు వినపడకుండా కవర్ చేయడం కొసమెరుపు.