నాగపూర్: రాజకీయాలను వదిలేయాలన్న ఆలోచనలు అప్పుడప్పుడు వస్తుంటాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజకీయాల కన్నా జీవితంలో చూడాల్సింది ఎంతో ఉందని ఆయన అన్నారు. నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు స్వస్తి పలకాలని ఎన్నో సార్లు అనుకున్నానని, కానీ అలా జరగడం లేదన్నారు. సామాజిక కార్యకర్త గిరీశ్ గాంధీ సన్మాన కార్యక్రమంలో గడ్కరీ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
రాజకీయాలంటే సామాజిక మార్పు అని, కానీ ఇప్పుడు అందరూ అధికారం కోసం రాజకీయాలను ఆశ్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ రోజుల్లో రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ అధికారం కోసం నూరు శాతం ప్రయత్నిస్తున్నారని, కానీ రాజకీయాలంటే సామాజిక ఆర్థిక సంస్కరణ అని, అందుకే నేటి రాజకీయవేత్తలు విద్య, కళలు సంస్కరణ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. రాజకీయం అనే పదాన్ని అర్థం చేసుకోవాలని, అది సమాజ, దేశ సంక్షేమం అని తెలిపారు.