ఖమ్మం, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఐదు రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంతోపాటు సత్తుపల్లి మండలం నారాయణపురం, వైరాలో నిర్వహించిన రైతుబంధు వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం మున్ముందు దొడ్డి దారిన రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నల్ల వ్యవసాయ చట్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించారని గుర్తుచేశారు.
వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకు 15 నెలల పాటు రైతులు సాగించిన పోరాటం అద్వితీయమని కొనియాడారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు పట్టించుకోరని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లు వివిధ రూపాల్లో ఖర్చు చేస్తున్నదని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, పంటలకు సాగునీరు అందించేందుకు ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసిందని అన్నారు. యాసంగి రైతుబంధుతో రైతుల ఇంటికి ముందే సంక్రాంతి వచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదని విమర్శించారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ.. రైతుబంధు పథకం చరిత్రాత్మకమని, సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. పంటల పెట్టుబడి ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించిన మహానాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పా రు. విత్తనాలు, ఎరువులు మొదలుకొని పంటల మద్దతు ధర వరకు ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ఆదుకొంటున్నదని వివరించారు. టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతుబంధుతో లక్షలాది కుటుంబాలు అప్పుల ఊబి నుంచి బయటపడ్డాయని సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 60 వేల కోట్లను వివిధ రూపాల్లో ఖర్చు చేస్తున్నది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, పంటలకు సాగునీరు అందించేందుకు ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగగా మార్చింది. యాసంగి రైతుబంధుతో రైతుల ఇంటికి ముందే సంక్రాంతి వచ్చింది.
-రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి