కల్వకుర్తి : దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దళితబంధు పైలెట్ ప్రాజెక్టుకింద కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరు గ్రామాల లబ్ధిదారులకు సోమవారం జూపల్లి గ్రామంలో 304 మందికి యూనిట్లను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి వివక్ష, నిరాధరణకు గురై ఆర్థికంగా అణగారిన దళితులకు హక్కులు కల్పించిన తొలినేత సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ దళితబంధు మానసపుత్రిక అని, దళితబంధును పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో నాలుగు మండలాలను ఎంపిక చేయగా.. అందులో చారగొండ ఉండడం విశేషమన్నారు.
ఏదైనా సరే చెప్పి చేయడంలో కేసీఆర్కు సాటి మరెవరూ లేరన్నారు. రాష్ట్రంలో సంపదను పెంచేందుకు 75శాతం వ్యవసాయ రాష్ట్రంలో నదుల ద్వారా సాగునీరిచ్చి, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయంగా రైతుబంధు, రైతుబీమా ఇచ్చి ప్రజలకు పని కల్పించడం ద్వారా నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణా నిలిచిందన్నారు. ఒకసారి అవకాశం కల్పిస్తే కష్టపడి పని చేసి.. ఆర్థికంగా బలోపేతమైతే మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తారని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆమన్గల్లో ఏడీఏ కార్యాలయం మంజూరు చేసి, త్వరలో ప్రారంభిస్తామన్నారు. కొత్త మండలాలకు గోదాములు త్వరలోనే మంజూరవుతాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పద్మావతి, ఎంపీ రాములు, ఎంఎల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ ఉదయ్ పాల్గొన్నారు.