బోడుప్పల్( హైదరాబాద్ ) : అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లని, బీఆర్ఎస్ది పేదల ప్రభుత్వమని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) అన్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్ధ పరిధిలో బుధవారం కల్యాణలక్ష్మి ( Kalyanalaxmi ) , షాదీముబారక్ ( Shadimubarak ) చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశం యావత్తు అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితిని సీఎం కేసీఆర్(CM KCR ) కల్పించారని అన్నారు. 43, 373మంది ఆర్టీసీ (RTC) కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మేనమామలా కల్యాణలక్ష్మి పథకాన్ని అందిస్తూ పేదప్రజల గుండెల్లో కేసీఆర్ కొలువైనాడని అన్నారు.
నగర శివారుప్రాంతంలో ఉన్న అవుటర్ రింగ్రోడ్డు చుట్లు మెట్రోరైలును ఏయిర్పోర్టుకు మెట్రో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం కృతనిచ్ఛయంతో ఉందని వెల్లడించారు. ప్రతిపక్షాలు చేస్తున్న చౌకబారు ఆరోపణలను నాయకులు, కార్యకర్తలు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
లేబర్లైసెన్స్ కలిగిన కార్మికులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్) ఆధ్వర్యంలో 90మందికి కుట్టుమిషన్లు అందజేశారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రారంభించారు. 12వ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ బస్తీ దవఖానాను ప్రారంభించారు.