మీ కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్జీ, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ కూడా జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని డిమాండ్చేస్తున్నారు. ‘హమారీ నహీ తో సహీ, గుజరాత్ కీ ఆవాజ్ తో సునియే పీయూష్ గోయల్ జీ..’
-ట్విట్టర్లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమపై కొత్త సంవత్సరం నుంచి విధించబోతున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తే, సాగు చట్టాల విషయంలో రైతులు తిరగబడ్డట్టే నేతన్నలూ తిరగబడతారని హెచ్చరించారు. పన్ను పెంపును విరమించుకొనే వరకు వస్త్ర పరిశ్రమకు, పారిశ్రామిక వర్గాలకు, దేశంలోని నేతన్నలకు తెలంగాణ తరఫున అండగా ఉంటామని ప్రకటించారు. శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో.. గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ రాశారు. జీఎస్టీ పెంపుతో దేశవ్యాప్తంగా వస్త్ర, చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కోట్లమంది కార్మికులకు ఇది సమ్మెట పోటని ఆవేదన చెందారు.
కేంద్రం నిర్ణయం వారి జీవితాలను పూర్తిగా దెబ్బ తీస్తుందన్నారు. దేశంలో వ్యవసాయరంగం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తున్న చేనేత జౌళి రంగంపై జీఎస్టీ పెంపు.. ప్రజావ్యతిరేక నిర్ణయమని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేశారు. కరోనా సంక్షోభంలో చిక్కుకొన్న పరిశ్రమలను ఆదుకోవడంలో కేంద్రం అనేకసార్లు విఫలమైందని, కొవిడ్ సంక్షోభం నుంచి బయటపడుతామని ఆశిస్తున్న తరుణంలో జీఎస్టీ పెంపు పరిశ్రమను మరింత దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. జీఎస్టీ పెంపు ద్వారా 80% నుంచి 85% దేశంలోని చేనేత జౌళి పరిశ్రమ ఉత్పత్తులు తీవ్ర ప్రభావానికి గురవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
సామాన్యులకు కష్టాలు
వస్త్ర పరిశ్రమ ఉపయోగించే యార్న్, రసాయనాలు, ప్యాకేజింగ్ మెటీరియల్, రవాణా వంటి ఖర్చులు ఇప్పటికే భారీగా పెరిగాయని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. అదనంగా జీఎస్టీ పెంచడంతో వస్ర్తోత్పత్తుల ధరలు 15% నుంచి 20% వరకు పెరుగుతాయని, సామాన్యులు ఇబ్బంది పడుతారని తెలిపారు. టెక్స్టైల్స్, అప్పారెల్ యూనిట్లు నష్టాలపాలై మూతపడే ప్రమాదమున్నదని హెచ్చరించారు. చేనేత, జౌళి రంగంలోని కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టే ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సాధారణ, మధ్య తరగతి ప్రజలపైనా జీఎస్టీ పెంపు పెనుభారంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. 15 లక్షలకు పైగా చేనేత, జౌళి రంగంలోని ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనను కేటీఆర్ వ్యక్తంచేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఎలాగూ నిలుపుకోలేని కేంద్రం.. కనీసం చేనేత, జౌళి రంగంలోని కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు పెట్టే ఈ ప్రతిపాదననైనా వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు. మనకు ఎన్నో గొప్ప అవకాశాలు ఉన్నప్పటికీ.. కేంద్ర విధానాల ఫలితంగా బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాల కన్నా తక్కువ అభివృద్ధే ఈ రంగంలో ఉన్నదని పేర్కొన్నారు. జీఎస్టీ పెంపుతో అంతర్జాతీయ పెట్టుబడులు ఆగిపోతాయని, దీర్ఘకాలంలో దేశ వస్త్ర పరిశ్రమకు ఇది గొడ్డలిపెట్టుగా మారుతుందని హెచ్చరించారు.
మరో రైతు ఉద్యమమే
వస్త్ర పరిశ్రమ విషయంలో తాము చేపట్టిన అనేక ప్రోత్సాహక చర్యల ద్వారా ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న తెలంగాణ నేతన్నల జీవితాలను పన్ను పెంపుదల తీవ్రంగా ప్రభావం చేస్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. జీఎస్టీ పెంపు విషయంలో వస్త్ర పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను.. జరుగుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని హితవుచెప్పారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు తిరగబడ్డట్లే.. నేతన్నలు సైతం తిరగబడతారని హెచ్చరించారు.
బడా పారిశ్రామికవేత్తల కోసమేనా?
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలు, చర్యలతో నేతన్నలకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఆత్మహత్యలు తగ్గాయి. కానీ.. కేంద్రం జీఎస్టీ పెంచితే.. మళ్లీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బడా పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చేలా కేంద్రం నిర్ణయాలు ఉంటున్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చేనేత, జౌళి రంగంపై కేంద్రం పెంచుతున్న జీఎస్టీతో రాష్ట్రంలో లక్షల కుటుంబాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం పడనున్నది. రాష్ట్రంలో చేనేతపై 57 వేల మంది, జౌళి రంగంపై లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. 5% ఉన్న జీఎస్టీని ఒక్కసారిగా 12 శాతానికి (120%) పెంచడం.. వస్ర్తాల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో అమ్మకాలు తగ్గుతాయి. వస్త్రాల ఉత్పత్తి తగ్గుతుంది. యాంత్రీకరణ పెరిగిన తర్వాత చేనేతరంగం నానాటికీ కుదేలవుతున్నది. 1970లో దేశవ్యాప్తంగా 1.24 కోట్ల మంది చేనేతపై ఆధారపడితే 1995 నాటికి ఆ సంఖ్య 64 లక్షలకు పడిపోయింది. 2011 నాటికి 43.30 లక్షలకు తగ్గింది. తాజాగా 30.44 లక్షలకు పడిపోయింది. ఈ పరిస్థితిలో ఆదుకోవాల్సిన కేంద్రం ఆ రంగాన్ని మరింత బలహీనం చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.