రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. మంగళవారం సిరిసిల్ల జిల్లాలో మంత్రి పర్యటించారు. గంభీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేటలో అభయాంజనేయ స్వామి, సిరిసిల్ల పట్టణంలోని గంగాభవానీ, మడేలేశ్వరస్వామి, రామప్ప ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
మొదట గంభీరావుపేటలో రూ.50 లక్షల నిధులతో చేపట్టిన అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ కళ తదితరులు పాల్గొన్నారు.