సికింద్రాబాద్, మార్చి 2 : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు గ్రేటర్ పరిధిలోని 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను జీహెచ్ఎంసీ విడుతల వారీగా లబ్ధిదారులకు అందిస్తున్నది. ఈ క్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గపరిధిలోని మోండా డివిజన్ ఓల్డ్ మారేడ్పల్లిలో నిర్మించిన 468 డబుల్ బెడ్ రూం ఇండ్లను గురువారం లబ్ధిదారులకు అందించనున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నల అధ్యక్షతన గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎంపీ కేశవరావు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్రెడ్డి పాల్గొననున్నారు. సుమారు రూ.36.27కోట్ల వ్యయంతో 22 బ్లాక్లలో 468 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, వసతులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.