రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): స్వార్థ రాజకీయాల కోసం మంటలు రగిలిస్తూ తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్రలు చేస్తున్న మతతత్వ శక్తులను తిప్పికొట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో ఉండాలే తప్పా అశాంతి, అలజడులతో కాదని స్పష్టంచేశారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా కొందరు వక్రీకరించడం సిగ్గుచేటన్నారు.
వసుధైక కుటుంబం అనే భావన నెలకొల్పుతూ ప్రతి ఒక్కరూ దేశం కోసం పాటుపడాలని కోరారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడటమే నిజమైన సమైక్యత అని చెప్పారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన వీరులను, యోధులను స్మరించుకునేందుకే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కుమ్రంభీం, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలాంటి త్యాగధనుల సాహసాలు మరవలేనివన్నారు.
కేసీఆర్ నాయకత్వంతో తెలంగాణ టాప్
సీఎం కేసీఆర్ పాలనాదక్షత, సమర్థనాయకత్వం వల్లనే తెలంగాణ ఏర్పడ్డ ఎనిమిదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే టార్చ్బేరర్గా నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తలసరి ఆదాయంలో ముందువరసలో ఉండి దేశానికే అన్నపూర్ణగా ఎదిగిందని పేర్కొన్నారు. కాళేశ్వరం సహా ఎన్నో అనితర సాధ్యంకాని పనులను సుసాధ్యం చేశామని చెప్పారు. రైతుబంధు పథకం దేశంలో ఏ నాయకుడికీ రాని ఆలోచన అని, అది సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని వ్యాఖ్యానించారు.
దేశంలో మొదటిసారి ప్రతి ఇంటికీ తాగు నీరందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టంచేశారు. మిడ్మానేరులో రూ.2 వేల కోట్ల భారీ పెట్టుబడులతో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా ఆక్వాహబ్ను త్వరలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. రైతుల మాదిరే నేతన్నలకు బీమా సౌకర్యం కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. సొంత స్థలం ఉన్న పేదలు ఇల్లు కుట్టుకునేందుకు త్వరలో రూ.3 లక్షల పథకం ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అనంతరం పలువురు స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు.