హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ) : ప్రాణాంతకంగా మారే రేబిస్ వ్యాధిని నియంత్రించేందుకు రూపొందించిన అభయ్రాబ్ వ్యాక్సిన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొంటున్నది. ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) 25ఏండ్ల క్రితం అభయ్రాబ్ వ్యాక్సిన్ను హైదరాబాద్ కేంద్రంగా తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ రూపాంతరం చెందుతున్న రోగ కారకాలకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకొంటూనే ఉంది. కుక్క కాటు కారణంగా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఐఐఎల్ తొలిసారిగా అభయ్రాబ్ వ్యాక్సిన్ రూపొందించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థగా ఐఐఎల్ గుర్తింపు పొందింది.
ప్రస్తుతం వ్యాక్సిన్లను ప్రపంచ మార్కెట్లకు హైదరాబాద్ కేంద్రంగా ఎగుమతి చేస్తున్నారు. 1998లో వెరోసెల్ ఆధారిత రేబీస్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగా, ఇప్పటివరకు 50 దేశాలకే ఎగుమతి చేశారు. కానీ, ఐఐఎల్ 25ఏండ్లలో ఏకంగా 173 మిలియన్ డోసులను మార్కెట్లోకి సరఫరా చేసింది. ప్రస్తుతం జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో కలిసి శరవేగంగా విస్తరించే జంతు సంబంధిత వ్యాధులకు టీకాలను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించినట్టుగా ఐఐఎల్ వర్గాలు తెలిపాయి. తాజాగా, ఐఐఎల్ 45వ వార్షికోత్సవం సందర్భంగా యాంటీ రేబీస్ వైరస్ నూతన మాడల్ను ఆవిష్కరించారు.