హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో భారీ పెట్టుబడి ఖాయమైంది. జర్మనీకి చెందిన వాహన పనిముట్ల తయారీ సంస్థ లైట్ఆటో జీఎంబీహెచ్ రాష్ట్రంలో 180 నుంచి 200 మిలియన్ యూరోల (దాదాపు రూ.1,500 కోట్ల) పెట్టుబడులు పెట్టేందుకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. జహీరాబాద్లో వంద ఎకరాల స్థలంలో నెలకొల్పనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 9వేల మందికి, పరోక్షంగా 18వేల మందికి ఉపాధి లభించనున్నది. హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణాలో నిర్వహించిన జర్మన్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ.. లైట్ ఆటో సంస్థ వంద ఎకరాల స్థలం కావాలని కోరిన పదిరోజుల్లోనే ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు.
జర్మనీకి చెందిన పెట్టుబడిదారులు ముందుకొస్తే ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రాంతమని, ఇక్కడ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం ఉన్నదని వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూమి రెండు లక్షల ఎకరాలకు పైగా ఉన్నదని, పారిశ్రామికవేత్తలకు టీఎస్ఐఐసీ ద్వారా భూములు కేటాయిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలతో పాటు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నదని చెప్పారు. ఇతర రాష్ర్టాల కంటే మెరుగైన ప్యాకేజీలు వర్తింపజేస్తామని అభయమిచ్చారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని వివరించారు. హైదరాబాద్కు ఉన్న సానుకూలతలపై విడమరిచి చెప్పారు.
ప్రపంచంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్కు కనెక్టివిటీ ఉన్నదని, వ్యవసాయ రంగం నుంచి రక్షణ రంగం వరకు అనేక రిసెర్చ్ ల్యాబ్లు ఉన్నాయని వివరించారు. ఇక్కడి సంస్థలతో భాగస్వామ్యం నెలకొల్పుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. మెసర్స్ సంస్థ ఇండెక్స్లో గత ఐదేండ్లుగా హైదరాబాద్ను దేశంలోనే బెస్ట్ లివబుల్ సిటీ పేర్కొంటున్నదని గుర్తుచేశారు. పరిశ్రమలతోపాటు అన్నిరంగాలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, ఇందులో 15 శాతం రెన్యువబుల్ ఎనర్జీ ఉన్నదని తెలిపారు. టీఎస్ఐపాస్ చట్టం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడమో, తిరస్కరించడమో చేస్తామని, ఒకవేళ 15 రోజుల్లో తేల్చకపోతే 16వ రోజు నుంచి సంబంధిత అధికారులకు రోజుకు రూ.1,000 చొప్పున జరిమానా విధించే చట్టం తెలంగాణలో అమలవుతున్నదని వివరించారు.
భూమి కేటాయించిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చునని స్పష్టంచేశారు. ఇలాంటి పాలసీ అమెరికాలో కూడా లేదని అక్కడి పారిశ్రామికవేత్త ఒకరు తనతో చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 17,500 పైచిలుకు దరఖాస్తులను క్లియర్ చేసినట్టు చెప్పారు. ఇందులో చాలావరకు అనుమతులు 10-11 రోజుల్లోనే మంజూరైనట్టు తెలిపారు. గత ఏడున్నరేండ్లలో రాష్ర్టానికి ఏడు బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, మరో 32-33 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు కమిట్మెంట్లు వచ్చాయని వివరించారు. రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడుల్లో 24 శాతం రిపీట్ పెట్టుబడులు ఉండటం తెలంగాణ ప్రభుత్వ విధానాల పట్ల పెట్టుబడిదారులకు ఉన్న సంతృప్తికి నిదర్శనమని చెప్పారు.
తయారీ పరిశ్రమలకు ఊతమిచ్చేలా జర్మనీ తరహాలో డ్యుయల్ డిగ్రీ విధానాన్ని రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జర్మనీ, అమెరికాలో మాదిరిగా పరిశ్రమల ఇకోసిస్టంను అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. కాలుష్యం సృష్టించే పరిశ్రమలను ఔటర్ రింగ్రోడ్డు లోపల అనుమతించడం లేదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలను కూడా ఓఆర్ఆర్ అవతలకు తరలిస్తున్నామని ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ప్రజలకు ఏ విధంగానూ హాని చేకూర్చని పరిశ్రమలను మాత్రమే ఓ ఆర్ఆర్ లోపల అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, భారత్లో జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండర్, చెన్నయ్లో జర్మన్ కౌన్సిల్ జనరల్ కరిన్ స్టోల్, నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెండు దశల్లో లైట్ ఆటో పెట్టుబడులు
జర్మనీకి చెందిన వాహన పనిముట్ల తయారీ సంస్థ లైట్ ఆటో జీఎంబీహెచ్ రాష్ట్రంలో రెండు దశల్లో 180 నుంచి 200 మిలియన్ యూరోలు (సుమారు రూ.1,500 కోట్లు) పెట్టుబడితో ప్లాంటును ఏర్పాటుచేయనున్నట్టు ఆ సంస్థ ఎండీ బాలానంద్ తెలిపారు. తమ ఉత్పత్తులు స్టీలు, అల్యూమినియం కన్నా తక్కువ బరువు, అధిక నాణ్యత కలిగివుంటాయని పేర్కొన్నారు. తాము నెలకొల్పే ప్లాంటు వల్ల తొమ్మిది వేల మందికి ప్రత్యక్షంగా, 18 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సంపూర్ణ సహకారం లభిస్తున్నదని కొనియాడారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ చొరవ, పెట్టుబడిదారుల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఎంతో బాగున్నదని, ఆయన సామాన్యుడిగా కాకుండా ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచిస్తున్నారని ప్రశంసించారు.
జనవరిలో కేటీఆర్ జర్మనీ పర్యటన: జయేశ్రంజన్
మంత్రి కేటీఆర్తోపాటు ఉన్నతాధికారుల బృందం వచ్చే జనవరిలో జర్మనీలో పర్యటించనున్నది. వీరు అక్కడి వాణిజ్య, పారిశ్రామికవర్గాలు, ఎస్ఎంఈలతో సమావేశమవుతారు. రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులు రాబట్టేందుకు కృషిచేయనున్నారు. జర్మన్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దావోస్లో జనవరి 17 నుంచి 21వరకు నిర్వహించనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు -2022లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని, అనంతరం జర్మనీలో పర్యటిస్తారని చెప్పారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనే అవకాశం తెలంగాణకు రావడం ఇక్కడి ఐటీ, పారిశ్రామిక, ఇన్నోవేషన్ రంగాలకు లభించిన గుర్తింపని పేర్కొన్నారు.
లైట్ ఆటో సంస్థ వంద ఎకరాల స్థలం కావాలని కోరిన పదిరోజుల్లోనే ఒప్పందం చేసుకున్నాం. జర్మనీకి చెందిన పెట్టుబడిదారులు ముందుకొస్తే ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. తయారీరంగ పరిశ్రమలకు ఊతమిచ్చేలా జర్మనీ తరహాలో డ్యూయల్ డిగ్రీ విధానాన్ని రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నది. దీర్ఘకాలిక పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ అత్యంత అనుకూలమైన ప్రాంతం.