అయోధ్య : అయోధ్య రామునికి భక్తులు సమర్పించిన కానుకల చోరీ కేసు దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఆలయంలో కానుకల అపహరణతో పాటు భక్తుల నుంచి విరాళాల పేరిట పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేందుకు నకిలీ రసీదు పుస్తకాలు సృష్టించినట్లు విచారణలో తేలింది. పోలీసు వర్గాలు అందించిన సమాచారం ప్రకారం నిందితుల నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరుతో ఉన్న ఒక నకిలీ రసీదుల పుస్తకాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయ కానుకలను కాజేయడమే కాకుండా, అధికారిక విరాళాల పేరుతో భక్తులను నమ్మించి, నకిలీ రసీదుల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.
భక్తులు ఎవరైనా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తే, నిందితులు ఈ నకిలీ రసీదులను జారీ చేసేవారని, దీంతో భక్తులు అవి అధికారిక రసీదులేనని నమ్మివుంటారని పోలీసులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న రసీదు పుస్తకాలు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు చెందిన పాత కాపీలు మాదిరిగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయోధ్య పోలీసులు జైల్లో ఉన్న అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, కరుణేశ్ పాండే అనే ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. ముఖ్యంగా నిందితుడు అనుకల్స్ మిశ్రా ఇటీవల కొనుగోలు చేసిన ఇల్లు, వాహనంపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే నిందితులు దొంగిలించిన సొమ్ముతో ఏవైనా ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.