హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ తెలంగాణ వ్యవసాయ సాగులో నూతన చరిత్రను సృష్టించనున్నదని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకొన్నారు. నీటితో కళకళలాడుతున్న మల్లన్నసాగర్ ఫొటోపై ‘ది మదర్ ఆఫ్ ఆల్ రిజర్వాయర్స్ ఇన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు’ అని రాసి ట్విట్టర్లో షేర్ చేశారు. 11.29 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్న అతిపెద్ద రిజర్వాయర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారని, అది మరచిపోలేని మధురజ్ఞాపకమని ఆనందాన్ని వ్యక్తంచేశారు.
బీజేపీ అసమర్థత వల్లే మతహింస
కర్నాటకలో చెలరేగుతున్న మతహింసకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అసమర్థతే కారణమని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. హింస ఎలాంటిదైనా తాము ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తామని, ఇలాంటివి సహించబోమని స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో మతహింసపై ఓ నెటిజన్ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. హింసను ఖండించారు. నేరస్థులు త్వరలో పట్టుబడతారని, బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందనే విశ్వాసం వ్యక్తంచేశారు.