హైదరాబాద్ వల్లే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని పలువురు చెప్తున్నారు. ఇతర రాష్ర్టాలకు కూడా రాజధాని నగరాలు ఉన్నప్పటికీ అక్కడ ఎందుకు ఇంత పురోగతి లేదు? దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్. ఆయన పెద్ద కలలు కంటారు. ఆలోచన గొప్పగా ఉంటుంది. ప్రజల కనీస అవసరాలు ప్రధానమని చెప్తారు.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన ఎన్నారైలు తమ స్వగ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. దీంతో పరాయి దేశంలో ఎంత సాధించినప్పటికీ, సొంతూరికి ఎంతోకొంత చేశామన్న సంతృప్తి దక్కుతుందని పేర్కొన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఐటీ సర్వ్ అలయెన్స్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ప్రాధాన్యతను, ఏడేండ్లలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. ఈ సభలో మహేశ్ బిగాలతో పాటు 22 మంది ఐటీరంగ ప్రముఖులు పాఠశాలల అభివృద్ధికి విరాళాలు ప్రకటించారు. వారిని మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను రూ.7,300 కోట్లతో మూడేండ్లలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. దాతలు విరాళాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. పాఠశాలల అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు వస్తే స్థానికులు స్ఫూర్తిగా తీసుకొంటారని చెప్పారు. అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ
కేసీఆర్ 2001లో ఉద్యమానికి బయలుదేరినప్పుడు రాష్ట్రం సాధ్యంకాదని చాలామంది అన్నారని, సినిమాల్లో కామెడీ కూడా చేశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ‘మొదలు నవ్వుతారు, తరువాత అవమానిస్తారు, ఎదురించి పోరాడితే గెలుస్తావు..’ అన్న గాంధీజీ సూక్తిని ఉటంకిస్తూ.. కేసీఆర్ పట్టుదల వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైందని చెప్పారు. 2015లో తాను ఇక్కడకు రాష్ర్టాన్ని పరిచయం చేయడానికి వచ్చానని, నేడు దేశంలోనే తొలి విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని చెప్పడానికి వచ్చానని తెలిపారు. దేశంలో రాష్ర్టాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని, జనాభా సంఖ్య గోవాలో లక్షల్లో ఉండగా, యూపీలో కోట్లలో ఉన్నాదని వివరించారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలు ఇంకా కుదుటపడలేదని, తెలంగాణ ఎంతో అభివృద్ధిని నమోదుచేసిందని చెప్పారు. తెలంగాణలో 2014లో రూ.1.24 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు 2.78 లక్షలకు (130%) పెరిగిందని వివరించారు. జీఎస్డీపీ రూ.4.9 లక్షల కోట్ల నుంచి రూ.11.54 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు.
ఇది దేశ సగటు కన్నా 125 శాతం అధికమని చెప్పారు. ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరింపజేస్తున్నామని, ఎన్నారైలు వాటి దృష్టిసారించాలని కోరారు. త్వరలో హైదరాబాద్లోని మలక్పేట వైపు ఫోకస్ పెడతామని వెల్లడించారు. వ్యయసాయరంగం కాంట్రిబ్యూషన్ 16 శాతం నుంచి 21శాతానికి వృద్ధి చెందిందని పేర్కొన్నారు. డీమానిటైజేషన్, కరోనా, కేంద్ర సహాయ నిరాకరణ వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా తెలంగాణ పురోగతిని సాధించిందని పేర్కొన్నారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తున్న 4వ రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.5 శాతమే అయినా ఆర్థిక వ్యవస్థలో కాంట్రిబ్యూషన్ 5 శాతం ఉన్నదని తెలిపారు. ఇవన్నీ వివిధ సంస్థల ద్వారా మోదీ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలేనని స్పష్టంచేశారు. హైదరాబాద్ మాదిరిగానే ఇతర రాష్ర్టాలకు రాజధాని నగరాలు ఉన్నప్పటికీ ఆయా రాష్ర్టాలు ఎందుకు పురోగతి సాధించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్లనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. కేసీఆర్ పెద్ద కలలు, గొప్ప ఆలోచనలతో ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తారని వివరించారు. రాష్ట్రంలో పచ్చదనం 24 నుంచి 31.7 శాతానికి చేరిందని తెలిపారు. 240 కోట్ల మొక్కలు నాటడమే కాకుండా 1,600 నర్సరీలు ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో సమగ్ర అభివృద్ధి సాధించలేదని స్పష్టం చేశారు.
హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నాం
రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను తయారుచేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. గణాంకాల ఆధారంగా సిరిసిల్లలో ఆంకాలజీ కేసులు, ములుగులో గుండె సంబంధ సమస్యలు, మహిళల్లో అనీమియా సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో సంబంధిత వైద్యులను ఎక్కువగా నియమిస్తామని చెప్పారు. ఆరున్నరేండ్లలో రాష్ట్రంలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలు నిర్మించినట్టు తెలిపారు. ప్రభుత్వ చర్యలు, కేసీఆర్ కిట్ల కారణంగా ప్రభుత్వ దవాఖానల్లో రద్దీ పెరిగిందని చెప్పారు. సాధారణ ప్రసవాలు పెరిగి, మాతా శిశు మరణాలు తగ్గాయని తెలిపారు. ఈ సందర్భంగా కొలంబియా యూనివర్సిటీలో డీన్గా పనిచేస్తున్న ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును వేదిక మీదకు పిలిచి మంత్రి కేటీఆర్ సన్మానించారు.
విద్యుత్తు సమస్యను అధిగమించాం
2014లో విద్యుత్తు కోతలు సర్వసాధారణంగా ఉండేవని, సిరిసిల్లలో ఎవరైనా చనిపోతే స్నానాల కోసం కొద్దిసేపు కరెంటు ఇవ్వాలని విద్యుత్తుశాఖ అధికారులను బతిమిలాడే పరిస్థితి ఉండేదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ ఆరు నెలల్లోనే పరిస్థితిని మార్చేశారని, రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలు నిరంతర విద్యుత్తు ఇస్తున్నట్టు చెప్పారు. విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 7 వేల మెగావాట్ల నుంచి 16,600 మెగావాట్లకు, సోలార్ పవర్ 40 మెగావాట్ల నుంచి 5 వేల మెగావాట్లకు పెరగిందని తెలిపారు.
మంచినీటి సమస్య లేకుండా చేశాం
తెలంగాణలో ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్లో గ్రామస్థాయిలో కేవలం ట్యాంకులు కట్టి వదిలేశారని, అంతటా నీళ్లు ఇస్తున్నట్టు చెప్పుకొంటున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేసినట్టు వివరించారు. ఓకల్ ఫర్ లోకల్ అని చెప్పే ప్రధాని మోదీ కాళేశ్వరం ప్రాజక్టును గుర్తించలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో 12 వేల గ్రామాల్లో మంచినీరు, వైకుంఠధామం, నర్సరీ, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలున్నాయని తెలిపారు. సంసద్ ఆదర్శ్ యోజన కార్యక్రమంలో టాప్-10 గ్రామాల్లో ఏడు తెలంగాణకే వచ్చాయని, 12 మున్సిపాలిటీలకు అవార్డులు వచ్చాయని చెప్పారు.
కేసీఆర్ 2001లో ఉద్యమానికి బయలుదేరినప్పుడు రాష్ట్రం సాధ్యంకాదని చాలామంది అన్నారు. సినిమాల్లో కామెడీ కూడా చేశారు. కేసీఆర్ పట్టుదల వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. నేను 2015లో మంత్రి హోదాలో రాష్ర్టాన్ని పరిచయం చేయడానికి ఇక్కడికి వచ్చా. నేడు దేశంలోనే మొట్టమొదటి విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రం తెలంగాణ అని చెప్పడానికి వచ్చా.
-మంత్రి కేటీఆర్
అమెరికాలో స్ట్రీట్ ఫుడ్ను ఆస్వాదించిన కేటీఆర్
మంత్రి కేటీఆర్ బిజీ షెడ్యూల్లో సైతం న్యూయార్క్ నగరం వెళ్లగానే అక్కడ తాను చదువుకొన్న రోజులను గుర్తుచేసుకొన్నారు. ఫైజర్ సీఈవోతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ వీధుల్లో కాసేపు నడిచారు. విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో తాను భుజించిన స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి, తనకు అత్యంత ఇష్టమైన వేడివేడి సాస్తో కూడిన చికెన్రైస్ని రుచి చూశారు. అక్కడి నుంచి ఎల్లో క్యాబ్లో సమావేశానికి బయలుదేరారు. కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలా వరుసలో నిలబడి ఆహారం కొనుక్కోవడం, తరువాత మీటింగ్కి క్యాబ్లో వెళ్లడం చూసి తెలుగు ఎన్నారైలు ఆశ్చర్యపోయారు. ఆయన సింప్లిసిటీకి అభినందనలు తెలిపారు.