హైదరాబాద్ : కోయ తెగకు చెందిన నిరుపేద విద్యార్థినికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఐఐటీలో సీటు సంపాదించిన ఆ సరస్వతి పుత్రికకు, ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ భరోసానిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడి గూడెం కి చెందిన శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తుంది. ఇంటర్మీడియట్లో 97 శాతం మార్కులను సాధించింది. నాగర్కర్నూల్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించిన ఆమె.. ఐఐటి వారణాసిలో ఇంజినీరింగ్ సీట్ సంపాదించింది. కానీ ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఇంజినీరింగ్ చదువుకు ఫీజులు చెల్లించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో శ్రీలత పరిస్థితి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే శ్రీలతతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కేటీఆర్ ప్రగతి భవన్కు పిలిపించి, ఇంజినీరింగ్ విద్య పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. శ్రీలత ఉన్నత విద్య పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అత్యంత నిరుపేద పరిస్థితుల్లో అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత ప్రస్థానం లక్షలాది మందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. ప్రజ్ఞాపాటవాలు ఎవరి సొత్తు కాదని, కృషితో ఏలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే విషయాన్ని శ్రీలత నిరూపించిందని కేటీఆర్ అన్నారు. శ్రీలత లాంటి ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆడబిడ్డకి అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ విద్యకు అవసరమైన డబ్బులను అందించారు. భవిష్యత్తులోనూ శ్రీలతకు అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఐఐటీలోనూ మరింత ప్రతిభ చాటాలని ఆమెకు కేటీఆర్ సూచించారు.
తన ఇంజినీరింగ్ విద్యకు సాయమందించిన కేటీఆర్కు శ్రీలత, ఆమె తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటానని శ్రీలత పేర్కొన్నారు.