ఆ ఇద్దరు విద్యార్థినుల అవగాహన కొత్త విజ్ఞానానికి తెరతీసింది. వారి పట్టుదలకు వీహబ్ ముచ్చటపడింది. ఆ బాలికల కృషికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయ్యారు. డిజిటల్ అక్షరాస్యత, ఉపాధి నైపుణ్య శిక్షణ, సైబర్ భద్రతపై వాళ్లు రూపొందించిన ‘డిజిజ్ఞాన్’ ప్రాజెక్టుకు ఏకంగా రూ.8 లక్షల సీడ్ క్యాపిటల్నూ అందించారు. అలా స్టార్టప్ స్థాపకులుగా మారిన ఆ ఇద్దరు విద్యార్థినులే మానసా రెడ్డి, నఫీసా అంజుమ్. ‘వీ హబ్’ చొరవతో హైస్కూల్ చదువు పూర్తికాకముందే ఆంత్రప్రెన్యూర్ల అవతారమెత్తిన ఈ బాలికల గురించి చదివేయండి..
హైదరాబాద్ బోడుప్పల్లోని పల్లవి మాడల్ స్కూల్లో మానస పదో తరగతి, నఫీసా తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం (వీ హబ్) నిర్వహిస్తున్న సెమినార్లకు అందరి విద్యార్థుల్లాగే వీళ్లూ హాజరయ్యేవారు. టెక్నాలజీ, డిజిటలైజేషన్కు సంబంధించిన పాఠాలు వీళ్లను బాగా ఆకట్టుకునేవి. ఈ ఇద్దరూ తమ స్కూల్ దత్తత తీసుకున్న కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి.. వాళ్లు నేర్చుకున్న విషయాలను అక్కడి విద్యార్థులతో పంచుకునేవారు. సాంకేతిక అంశాలపై చర్చిస్తున్నప్పుడు.. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకూ టెక్నాలజీపై అవగాహన ఉంటే బాగుంటుందని భావించారు మానస, నఫీసా. ఇదే విషయాన్ని తమ ఉపాధ్యాయులు, మెంటర్ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు, ఈ సమస్యను అధిగమించడానికి తమ దగ్గర ఒక ప్రాజెక్టు ఉందని చెప్పారు. పాఠశాల ప్రోత్సాహంతో తమ ఆలోచనను ‘డిజిజ్ఞాన్’గా అభివృద్ధి చేశారు. దీనిద్వారా విద్యార్థులకు డిజిటల్ అక్షరాస్యత, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
పాజిటివ్గా స్పందించారు..
‘మా ఐడియాను మెంటర్ మాధురి మేడమ్కు చెప్పినప్పుడు ఆమె ఎంతో ప్రోత్సహించారు. ప్రిన్సిపల్ తనూజ మేడమ్, డైరెక్టర్ సుశీల్కుమార్ సర్ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. వీ హబ్ వార్షికోత్సవానికి వెళ్లినప్పుడు మా డిజిజ్ఞాన్ గురించి విని మినిస్టర్ కేటీఆర్ సర్ చాలా ఇంప్రెస్ అయ్యారు. మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు. మాది సోషల్ స్టార్టప్ కావడంతో ఇనీషియల్ క్యాపిటల్ కోసం రూ.10 లక్షలు అవసరమని చెప్పాం. ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. రూ.8 లక్షలు ఫండింగ్ ఇచ్చారు. డిజిజ్ఞాన్ను మరింత విస్తృతం చేసేలా మా మెంటర్ పర్యవేక్షణలో ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఆడపిల్లలకు సాంకేతిక పరిజ్ఞానం అందివ్వడమే డిజిజ్ఞాన్ లక్ష్యం’ అంటున్నది మానస.
ఉచిత శిక్షణ..
‘మా అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అప్పుడప్పుడూ అమ్మతో నేనూ వాళ్ల స్కూల్కు వెళ్తుంటాను. అక్కడ చాలా చురుకైన విద్యార్థులు ఉంటారు. కానీ, టెక్నాలజీ అంశాలపై వారికి అంతగా అవగాహన లేదనిపించింది. మాలాగే వాళ్లకూ కంప్యూటర్ క్లాసులు, డిజిటల్ ఎక్స్పోజర్ ఉంటే బాగుంటుందని అనిపించేది. డిజిజ్ఞాన్ ఉద్దేశమూ అదే! విద్యార్థులకు సాంకేతిక అంశాలు, డిజిటల్ లావాదేవీలు, సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించేలా దీనిని రూపొందించాం. ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకున్నాం. మాతోపాటు పనిచేసేందుకు కొందరు వలంటీర్లకు శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం సమకూర్చిన ఫండింగ్తో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కొంత ఫీజుతో శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాం’ అని వివరించింది నఫీసా అంజుమ్. తమ పాఠశాల విద్యార్థినుల ప్రతిభకు ఈ స్థాయి గుర్తింపు రావడం సంతోషకరం అన్నారు పల్లవి స్కూల్ ప్రిన్సిపల్ తనూజ. వాళ్లు చేపట్టే కార్యక్రమాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.