హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): వంటగ్యాస్ సిలిండర్ ధరను మరో రూ.50 పెంచడంపై మంత్రి కేటీఆర్ శనివారం ట్విట్టర్లో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. అచ్చేదిన్ మళ్లీ వచ్చాయి.. తీసుకొచ్చిన కేంద్రానికి అభినందనలు అంటూ చురకలంటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపైనా వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు. ‘నడ్డాజీ.. కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేసిన సమయంలో రూ.7000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించారు’ టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిశాంక్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్..
‘అది ఎలా సాధ్యమవుతుంది.. ఆయన రాజా సత్యహరిశ్చంద్రుడి మొదటి బంధువు కదా?’ అని వ్యంగ్యంగా విమర్శించారు. మరో ట్వీట్లో బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి గురించి ఈడీ, ఐటీ, సీబీఐకి చెప్పడానికి ఏమైనా ఉన్నదా… నడ్డా జీ అంటూ ప్రశ్నించారు. ‘హలో నడ్డా జీ.. కర్నాటక సీఎం పదవి కావాలంటే రూ.2500 కోట్లు లంచం ఇవ్వాలని అడిగినట్టు మీ సొంత బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు. కాంట్రాక్టర్లు 40 శాతం కమీషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 30 శాతం కమిషన్ చెల్లిస్తున్నామని హిందూ మఠాల నిర్వాహకులు చెప్పారు. దీని గురించి విచారించాలని ఈడీ, ఐటీ, సీబీఐకి చెప్పే ఆదేశాలు ఏమైనా ఉన్నాయా?’ అని ప్రశ్నించారు.