హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. మంత్రి తలసానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఆయన కాంట్రాక్టర్ కాబట్టి.. కాంట్రాక్టుల్లో అవినీతి గురించే మాట్లాడుతారు తప్ప ఇతర విషయాల గురించి మాట్లాడరు అని తలసాని అన్నారు. మళ్లీ రాజగోపాల్ రెడ్డి కల్పించుకొని మంత్రి తలసానిని ఉద్దేశించి పేకాట ఆడినోళ్లు మంత్రులు కావొచ్చా? అని అడిగారు. దీంతో టీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కల్పించుకుని రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత నాలుగు రోజుల నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ చాలా చక్కగా జరుగుతోంది. రాజగోపాల్ ఫ్రస్టేషన్, వాళ్ల పార్టీ ఫ్రస్టేషన్ చాలా విచిత్రంగా ఉంది. బాధ్యాతయుతంగా, కుసంస్కారంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలోనూ, బయట అలాగే మాట్లాడుతున్నారు. వాళ్ల పార్టీ అధ్యక్షుడు కూడా నోటికి హద్దు, అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాళ్ల పార్టీ అధ్యక్షుడు అడ్డగోలుగా మాట్లాడిండు. మా పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు చేసుకుంటుంటే.. మూడు రోజుల పాటు సంతాప దినాలు చేసుకోండని వారి అధ్యక్షుడు మాట్లాడుతాడు. నిన్న కాక మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 98 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి, అడ్రస్ లేకుండా పోయారు. ఫ్రస్టేషన్లో ఉన్నారు. కేసీఆర్కు ఆరోగ్య పరమైన సమస్య వచ్చి హాస్పిటల్కు వెళ్లారు. బీజేపీ రిజల్ట్స్ చూసి కేసీఆర్ హాస్పిటల్కు పోయిండు అని రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు.. ఇదేనా వీరి సంస్కారం అని ప్రశ్నించారు. పద్దుల మీద మాట్లాడినప్పుడు పద్ధతిగా మాట్లాడాలన్నారు. అవినీతి అవినీతి అని గొంతు చించుకోవడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు.
అసలు వీళ్లది ఏ పార్టీ అంటే.. ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ భోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్, ఏ నుంచి జడ్ దాకా, ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా కుంభకోణాల్లో కూరుకుపోయిన దౌర్భాగ్యులు.. దౌర్భాగ్య పార్టీ అది. అలాంటి వారు అవినీతి గురించి మాట్లాడటం సరికాదు. అవినీతి మీద ఆధారాలుంటే సీవీసీ, ఏసీబీ, విజిలెన్స్, కోర్టులు ఉన్నాయి. గొంతులు చించుకోవడం, బట్టలు చింపుకోవడం కాదు. గాలి మాటలు మాట్లాడటం సరికాదు. ఒక బలహీనవర్గాల మంత్రిని పట్టుకొని పేకాట ఆడుతున్నావని అనడం దారుణమన్నారు. నోటికి హద్దు, అదుపు లేకుండా మాట్లాడిని రాజగోపాల్ రెడ్డి బేషరతుగా మంత్రికి క్షమాపణ చెప్పాలి. లేదంటే చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.