హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. దీని పునరుద్ధరణకు అవసరమైన అన్ని సదుపాయాలున్నాయని ఆయన గుర్తుచేశారు. కేంద్రం ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోపాటు కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి లేఖ రాశారు. సీసీఐ నిర్వహణకు విశాలమైన 772 ఎకరాల ప్రాంగణం, 170 ఎకరాల సీసీఐ టౌన్షిప్, 1,500 ఎకరాల్లో దాదాపు 48 మిలియన్ టన్నుల సున్నపురాయి (లైమ్స్టోన్) నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 2 కేవీఏ విద్యుత్తు సరఫరా వ్యవస్థ, ఉత్పత్తికి సరిపడినంత నీటి లభ్యత కూడా ఈ సంస్థకు ఉన్నదని పేర్కొన్నారు.
భౌగోళికంగా ఉమ్మడి ఆదిలాబాద్కు ఉన్న సానుకూలతను ఉపయోగించుకొని సీసీఐ యూనిట్ను పునరుద్ధరిస్తే తెలంగాణ అవసరాలకే కాకుండా మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాలకు కూడా ఇకడి నుంచి సిమెంట్ సరఫరా చేసేందుకు వీలవుతుందని తెలిపారు. దీనివల్ల వెనుకబడిన ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం కలుగుతుందని, ఆ జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న గిరిజన, ఆదివాసీ యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఇదే జిల్లాలోని దేవాపూర్లో ఓరియంట్ సిమెంట్ కంపెనీ తన ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు రూ.1,500 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో నిర్మాణ రంగం జోరుగా ముందుకు సాగుతున్నదని, భవిష్యత్తులో మరింత పురోగమిస్తుందన్న అంచనాల నేపథ్యంలో సిమెంట్కు దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందని చెప్పారు. దేశీయ సిమెంట్ పరిశ్రమ పురోగతి అద్భుతంగా ఉన్నదని, సిమెంట్ కంపెనీల లాభాలు కూడా ఏటేటా పెరుగుతున్నాయని తెలిపారు.
భవిష్యత్తులో సిమెంట్కు గిరాకీ
దేశంలో రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పన, పేదలకు పక్కా గృహాల నిర్మాణం విస్తృతంగా సాగుతున్నందున సమీప భవిష్యత్తులో సిమెంట్కు భారీ డిమాండ్ ఉంటుందని ఐసీఆర్ఏ, క్రిసిల్, సిమెంట్ ఉత్పత్తిదారుల అసోషియేషన్ లాంటి సంస్ధలు అంచనా వేస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం సిమెంట్ ఉత్పత్తి, వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉన్నదని, మరిన్ని కంపెనీలు సిమెంట్ ఉత్పత్తి ప్రారంభిస్తే మన దేశం ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకొనే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొంటూ.. ఈ విషయంపై దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించాలని కేంద్రానికి సూచించారు.
స్థానిక యువతకు అన్యాయం చేసినట్టే
ఎన్నో సానుకూలతలున్నప్పటికీ సీసీఐ యూనిట్ పునరుద్ధరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్నదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ యూనిట్ను తిరిగి తెరవాలని గతంలో పలుమార్లు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తిచేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. దీన్ని పునరుద్ధరించకపోతే తెలంగాణ యువతకు, ప్రత్యేకించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువతకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసినట్టేనని పేర్కొన్నారు. తెలంగాణ యువతకు సాధ్యమైనన్ని ఎకువ ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, టీఎస్ఐపాస్ ద్వారా రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రం అండగా నిలిచి సీసీఐ యూనిట్ను తిరిగి తెరుస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
సీడీఎంఏ సత్యనారాయణ చొరవ అద్భుతం
మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిపాలన వ్యవహారాలు, పట్టణాభివృద్ధికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒకేచోట దొరికేలా మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ (ఎంఎన్సీ) ఏర్పాటుచేయడంలో సీడీఎంఏ డాక్టర్ ఎన్ సత్యనారాయణ అద్భుతమైన చొరవ చూపారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు ట్విట్టర్లో అభినందించారు. ఎంఎన్సీ వీడియోను ఆదివారం సీడీఎంఏ ట్వీట్ చేసింది. పట్టణాలపై అధ్యయనం చేసేవారికి, వాటికి సంబంధించిన సమగ్ర సమచారం ఇందులో లభించేలా ఏర్పాట్లు చేసినట్టు వీడియోలో చూపించింది. దానిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. సీడీఎంఏ సత్యనారాయణను ప్రశంసించారు. ఈ సెంటర్ను డిసెంబర్ 30న మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.