హైదరాబాద్ : తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎలాంటి అల్లర్లు, అలజడి లేకుండా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జనరంజకంగా పాలనను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలను సమభావంతో చూస్తూ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు.
జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేశారు. మైనార్టీల పిల్లలు చదువుకు దూరంగా ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు 204 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి లక్షకు పైగా విద్యార్థులకు పూర్తి ఉచితంగా విద్యను అందిస్తున్నారని తెలిపారు. మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ ఆలోచన చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని, గత ప్రభుత్వాలు 2000 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, మన బీఆర్ఎస్ ప్రభుత్వం 15 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.