జగిత్యాల : రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుతాలు సృష్టించారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా బీమారం మండలం ఏర్పాటైంది. తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుతో కలిసి మంత్రి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీమారం మండలం కొత్తగా ఏర్పాటయ్యిందన్నారు. సందర్భంగా సీఎం కేసీఆర్కు మండల ప్రజల తరఫున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, మూడు చక్రాల స్కూటీలు, దళితబంధు ద్వారా మంజూరైన వ్యాన్ను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, కలెక్టర్ రవి నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.