హైదరాబాద్: చారిత్రాత్మక జహంగీర్ పీర్, పహడీషరీఫ్, మౌలాలి దర్గాల అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి..త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి కొప్పుల శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు రెండున్నర గంటల పాటు సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ..జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి పనుల కోసం 4 ఎకరాలు సేకరణకు సంబంధించి..రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న అనీసుల్ గుర్భా, చారిత్రాత్మక మక్కా మసీదులో కొనసాగుతున్న మరమ్మత్తుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మక్కామసీదు పనులను నెల రోజుల్లో, అనీసుల్ గుర్భాను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు మంత్రి కొప్పులకకు హామీనిచ్చారు.
కోకాపేటలో ప్రతిపాదిత క్రిస్టియన్ భవన్, రాజస్థాన్లోని అజ్మీర్లో అషూర్ ఖానా నిర్మాణాలకు సంబంధించి నెలకొన్న అడ్డంకులను తొలగించే విషయమై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు నిర్దేశించారు. వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులను లీజుకిచ్చే విషయమై సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ప్రభుత్వోద్యోగాల భర్తీ కోసం పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో..మైనారిటీ యువత ఓపెన్ కేటగిరీలో కూడా గొప్పగా రాణించే విధంగా అత్యుత్తమ శిక్షణ ఇప్పించాల్సిందిగా అధికారులకు మంత్రి కొప్పుల దిశానిర్దేశం చేశారు.