రెప్పపాటు విద్యుత్ అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు
యజ్ఞాశాల, భోజనశాలల్లో విద్యుత్ ఏర్పాట్లు
యాగం కొరకు ప్రత్యేక సిబ్బంది నియామకం
33/11 కేవీ సబ్ స్టేషన్, 28 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు
ఆలయ ప్రాంగణంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలన
హైదరాబాద్ : ముచ్చింతల్లోని శ్రీశ్రీశ్రీ త్రిదండీ చిన్న జీయర్ స్వామి వారి ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ రామనుజుల స్వామి విగ్రహం యావత్ భారత దేశాన్ని ఆకర్షించే విధంగా రూపుదిద్దుకుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక హబ్గా మారనుందని ఆయన చెప్పారు. స్వామి వారి ట్రస్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ రామనుజుల స్వామి విగ్రహాన్నిఆవిష్కరించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం మంత్రి జగదీష్ రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, జగత్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు.
ఫిబ్రవరి 2 నుండి 14 వరకు జరిగే వివిధ కార్యక్రమాలపై చిన్న జీయర్ స్వామి మంత్రి జగదీశ్ రెడ్డితో ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు, గవర్నర్లు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అధికారులు, అనాధికారులు తరలి రానున్నందున విద్యుత్ ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా విద్యుత్ ప్రసారంలో రెప్పపాటు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలోనీ యజ్ఞశాల, భోజనశాలల్లో విద్యుత్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. పదిరోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవంలో నిరంతరం విద్యుత్ సరఫరాను సమీక్షించేందుకు ప్రత్యేక విద్యుత్ సిబ్బందిని నియమించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 33/11కేవీ సబ్ స్టేషన్, 28 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.