సూర్యాపేట : ఎమ్మెల్సీల తిరస్కరణ పై గవర్నర్ తమిళి సై చెబుతున్న సాకులు గురువింద సామెతను గుర్తుకు తెస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీల విషయం తప్పుడు నిర్ణయం తీసుకున్న గవర్నర్ సెల్ఫ్ గోల్ చెసుకుందని తెలిపారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను కేబినెట్ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
కేబినెట్ సిఫార్సు చేసిన అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని గవర్నర్ పేర్కొనడం హాస్యాస్పదం అన్నారు. తమిళి సై తెలంగాణ గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బీజేపీ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారన్నారు. గవర్నర్ పదవీ ప్రకటన తరువాత ఆ పదవికి రాజీనామా చేసిన గవర్నర్ అయిన తమిళ సై నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుంటా అనడం అర్దరహితం అన్నారు.
బీజేపీ నుంచి గవర్నర్గా వచ్చి ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదన్నారు. గవర్నర్ చెప్పే లెక్క ఆమెకూ వర్తిస్తుందని ఎద్దేవా చేశారు. తిరస్కరణ నీతితో ఆమె కూడా గవర్నర్ పదవికి అర్హురాలు కాకుండా పోతుందన్నారు. నీతులు చెప్పే గవర్నర్ నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.