సూర్యాపేట : త్రిదండి చినజీయర్ స్వామి ప్రవచనాలు అమృతవాక్కులని, అద్భుతమైన సందేశాలను సైతం అలవోకగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం జీయర్స్వామి తిరునక్షత్ర (జన్మదినం) వేడుకలు సందర్భంగా జిల్లాకేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఆండాళ్ గోష్ఠి, వికాసతరంగిణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు మంత్రి చేతుల మీదుగా చీరెలు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి జీయర్స్వామి తిరునక్షత్రం వేడుకలు జరుపుకోవడం ఆనందంగా మహదానందంగా ఉందన్నారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలతో పాటు ఆధునిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్న ఏకసంతాగ్రహి జీయర్స్వామి అని కొనియాడారు. ఈ సందర్భంగా భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణకు దోహదపడే పలు కార్యక్రమాలు చేపడుతున్న ఆండాళ్ గోష్ఠి, వికాసతరంగిణి కార్యకర్తలను మంత్రి అభినందించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాల సైదులుగౌడ్, పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్ , ఉప్పల ఆనంద్, కక్కిరేని నాగయ్య గౌడ్, మహిళా టీఆర్ఎస్ అధ్యక్షురాలు కరుణశ్రీ , ఆండాళ్ గోష్ఠి, వికాస తరంగణి సభ్యులు శ్రీరంగం వల్లి, హైమావతి, పద్మ, ఉప్పల గోపాల కృష్ణ, విజయ్ కుమార్, శంకర్, రాము, వెంపటి రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, భక్త బృందం పాల్గొన్నారు.