సూర్యాపేట : సీఎం కేసీఆర్ పాలన దేశానికి రోల్ మోడల్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సూర్యాపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదని.. పార్టీ నిర్ణయమే ప్రభుత్వం అమలు పరుస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ టీఆర్ఎస్ రూపొందించినవేనన్నారు. గులాబీ జెండాయే తెలంగాణకు రక్ష అన్నారు. ఎన్నికల్లో మేనిఫెస్టోను రూపొందించేది పార్టీయేనని, అధికారంలోకి వచ్చాకా అదే మేనిఫెస్టోను ప్రభుత్వం అమలుపరుస్తుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతుబంధు, బీమా పథకాలు, ఆసరా పథకం కింద పింఛన్లు అందజేస్తుందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకం ఆయా పార్టీల ఏలుబడిలో రాష్ట్రాల్లో ఎందుకు లేదని ప్రశ్నించారు. 2014కు పూర్వం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా? అన్నారు. సీఎం కేసీఆర్కు ఉన్న ధైర్యం ఎవరికి ఉందని, బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్యకర్తలు ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సెప్టెంబర్ 2న జెండా పండుగను విజయవంతం చేయాలన్నారు.