నిర్మల్: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె చేపట్టిన బ్యాంకు ఉద్యోగులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న సమ్మెకు మద్దతు తెలపాలని బ్యాంకు ఉద్యోగులు శనివారం మంత్రిని కోరారు. ఈ సందర్భంగా వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ఆర్థికవ్యవస్థను పీడిస్తున్న అన్ని సమస్యలకు ప్రైవేటీకరణ పరిష్కారమని కేంద్ర ప్రభుత్వం భావించడం సరైంది కాదన్నారు. మోదీ ప్రభుత్వం ఒక్కో రంగాన్ని నెమ్మదిగా ప్రైవేటు పరం చేస్తూ వస్తోందని, బ్యాంకింగ్ రంగాన్ని కూడా ప్రైవేటీకరిస్తున్నదని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా రైతులు నెలల తరబడి పోరాటం చేస్తున్నారని, ఇప్పుడు అదే లక్ష్యంతో బ్యాంకింగ్రంగం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ… బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తమ మద్దతు ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.