నిర్మల్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ (RTC) దృష్టి సారించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇందులోభాగంగా నిర్మల్ (Nirmal) బస్టాండ్ ఖాళీ స్థలంలో వాణిజ్య సముదాయాన్ని (Commercial complex) నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ.34.43 కోట్ల వ్యయంతో నిర్మిస్తన్న ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్కు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి మంత్ర ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 1.3 ఎకరాలలో 43 వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నామన్నారు.
ఇందులో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్, జీ ప్లస్ త్రీ నిర్మాణంలో 53 స్టాళ్లను, శుభకార్యాలు నిర్వహించేందుకు కూడా ప్రత్యేక హాలును నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్ హాళ్లు, ఇతర సౌకర్యాలతో పాటు ఎల్సిడీ తెరలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకుని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.