హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ సాకారం కావాలని, అన్ని ఆరోగ్య సూచీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఆరోగ్య సూచీల్లో రాష్ట్ర సగటు కన్నా తక్కువున్న జిల్లాలు పురోగతి సాధించాలని, పనితీరులో నెలనెలా వృద్ధి కనిపించాలని అన్నారు. పదోన్నతులు, ప్రోత్సాహకాలకు అదే గీటురాయి అవుతుందని స్పష్టం చేశారు. శనివారం జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై కోఠిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ పరిస్థితిని అడిగి తెలుసుకొన్న ఆయన.. జిల్లాల వారీగా పరిశీలన చేస్తూ, ఎప్పటికప్పుడు వైద్యాధికారులను అప్రమత్తం చేయాలని చెప్పారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకొంటూ పరిసరాల పరిశుభ్రతకు, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. రక్తహీనతను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రసూతి మరణాలు తగ్గించేందుకు కృషి చేయాలని, దవాఖాన ప్రసవాలను 97 శాతం నుంచి 100 శాతానికి పెంచేలా కృషి చేయాలని చెప్పారు. ప్రసూతి మరణాలు తగ్గించే విషయంలో దేశంలో నాలుగోస్థానంలో ఉన్నామని, తొలిస్థానానికి వచ్చేలా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
పల్లె దవాఖానలు వేగంగా పూర్తవ్వాలి
రెండువారాల్లో గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో క్యాథ్ ల్యాబ్స్ సిద్ధం కావాలని అధికారులను మంత్రి హరీశ్ ఆదేశించారు. ఖమ్మంలోని క్యాథ్ ల్యాబ్ పనులు పూర్తిచేసి, ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వైద్యసేవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ ఆన్లైన్(హెచ్ఐఎంఎస్)లో నమోదు చేయాలని సూచించారు. పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలని, నెలనెలా పురోగతిపై సమీక్ష చేస్తానని చెప్పారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
దేశానికి ఆదర్శంగా టీ-డయాగ్నస్టిక్స్ సేవలు
టీ-డయాగ్నస్టిక్స్ సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి హరీశ్రావు ప్రశంసించారు. గత నెల బీహార్ ప్రభుత్వ అధికారులు మన రాష్ర్టాన్ని సందర్శించి టీ-డయాగ్నస్టిక్ సేవలు ప్రజలకు అందుతున్న తీరును పరీశిలించారని, వచ్చేవారం ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా తమ బృందాలను పంపుతాయని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగం మరింత పెరగాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని, డిసెంబర్ చివరినాటికి రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా కృషి చేయాలని అన్నారు. సమీక్షలో వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆశ, మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, మిడ్ వైఫెరీ, ఆర్బీఎస్కే, హెచ్ఎంఐఎస్, టీబీ, టీ-డయాగ్నస్టిక్స్, 108, 104, యూపీహెచ్సీ, సాంక్రమిత, అసాంక్రమిత వ్యాధులు, పల్లె దవాఖానలు, పీహెచ్సీలు, వాక్సినేషన్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.