‘పేదల సంజీవనిగా పేరొందిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్)లో వైద్య సేవలు మరింత వేగంగా అందాలి. ప్రతిఒక్కరికీ నాణ్యమైన వైద్యమందాలనేది సీఎం కేసీఆర్ సంకల్పం. నిత్యం వేలాది మంది వచ్చే దవాఖానలో సిబ్బంది పనితీరు మెరుగుపడాలి. అన్ని విభాగాలు సమన్వయంతో ఉండాలి. రోగికి చక్కటి వైద్యమందాలంటే నిర్ధారణ పరీక్షలు, ఫలితాలు చాలా ప్రధానం. ఇకనుంచి 24 గంటల్లోనే పాథాలజీ, రేడియాలజీ రిపోర్టులు అందజేయాలి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్భారత్ సేవలు మరింత పెరగాలి. దవాఖానలో 50 పడకల ఐసీయూ విభాగం నిర్మాణంలో ఉన్నది. దీన్ని త్వరగా పూర్తి చేయాలి.
మరో 250 సాధారణ పడకలను పెంచుతాం. ఇక్కడ పారిశుధ్య నిర్వహణ బాగాలేదు. పాత కాంట్రాక్టును రద్దు చేసి కొత్త కాంట్రాక్టుకు టెండర్లు పిలవాలి. జనవరి 1న మళ్లీ వస్తా. అప్పుడు సిబ్బంది పనితీరు పరిశీలిస్తా’అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఉస్మానియా దవాఖానలో రూ.7 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ్ల్యాబ్, రూ.2.12కోట్లతో సీటీస్కాన్ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం వార్డుల్లో కలియతిరిగి రోగులతో మాట్లాడి సేవలపై ఆరాతీశారు. త్వరలో ఖమ్మం, ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ప్రభుత్వ దవాఖానల్లో క్యాథ్ల్యాబ్లను ఏర్పాటు చేస్తామని, నెలన్నరలో గాంధీలో ఈ ల్యాబ్ ఏర్పాటు పూర్తవుతుందని చెప్పారు.
ఉస్మానియా దవాఖానలో కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. దేశంలో మూడోదిగా, తెలుగు రాష్ర్టా ల్లో మొదటదిగా దవాఖానలో ఏర్పాటు చేసిన చర్మనిధి (స్కిన్ బ్యాంక్)లో భద్రపర్చిన చర్మాన్ని ఓ యువకుడికి అతికించారు. 50 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న నవీన్కు హోమోగ్రాఫ్ట్ శస్త్రచికిత్స ద్వారా ఆ చర్మాన్ని అమర్చారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేసిన ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఇన్చార్జి హెచ్వోడీ డాక్టర్ నాగప్రసాద్, వైద్యులను మంత్రి హరీశ్రావు అభినందించారు.
‘గుండె వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ఉస్మానియా దవాఖానలో క్యాథల్యాబ్ను అందుబాటులోకి తీసుకువచ్చాం.
రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు క్యాథల్యాబ్లను త్వరలోనే ప్రారంభిస్తాం’ అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం ఉస్మానియా దవాఖానలో రూ.7 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథల్యాబ్ను, రూ.2.12 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ-స్కాన్ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు మంత్రి దవాఖానలో కలియతిరిగి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. తరువాత వైద్యాధికారులతో సమీక్ష జరిపారు.
అనంతరం మంత్రి హరీశ్రావు విలేకరులతో మాట్లడుతూ ఉస్మానియలో ఇప్పటికే రెండు సీటీ-స్కాన్లు ఉండగా కొత్తగా మూడో సీటీ-స్కాన్ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రోగులకు ఏ రోజుకు ఆ రోజు స్కానింగ్ జరిగి, త్వరితగతిన చికిత్స అందాలనే మరొకటి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హృద్రోగుల ఇబ్బందులు గుర్తించిన సీఎం కేసీఆర్ ఉస్మానియాలో కొత్త క్యాథల్యాబ్ కోసం రూ.7కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ల్యాబ్లను రాష్ట్రంలోని గాంధీ దవాఖాన, ఖమ్మం, ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్లోని హాస్పిటళ్లల్లో కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
50 పడకల ఐసీయూని రెండు నెలల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. మరో 250 పడకలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ అండ్ హెల్త్కి వెళ్లాలని నిర్ణయించామన్నారు. కాగా, దవాఖానలో శానిటేషన్ సరిగా లేనందున వెంటనే పాత కాంట్రాక్ట్ను రద్దుచేసి కొత్త టెండర్లను పిలవాల్సిందిగా డీఎంఈ, టీఎస్ఎంఐడీసీ ఎండీని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
ఉస్మానియా మార్చురీలో ప్రతి నెలా సుమారు వెయ్యి పోస్టుమార్టమ్లు జరుగుతాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఆధునిక మార్చురీ ఏర్పాటుకు రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉస్మానియా మార్చురీని సందర్శించిన ఆయన ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఉద్యోగులకు అదనంగా మరో ముగ్గురిని నియమించాలన్నారు. మార్చురీ వెయిటింగ్హాల్, కోల్డ్సర్వీస్ను ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. రాత్రి సమయంలో కూడా పోస్టుమార్టం నిర్వహించేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఉస్మానియా మార్చురీలో అవసరమైన లైటింగ్ వ్యవస్థపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
జనవరి 1న ఉస్మానియాకు మళ్లీ వస్తానని, అప్పటి వరకు సిబ్బంది పనితనంలో జరిగిన పురోగతని నూతన సంవత్సరంలో సమీక్షిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్భారత్ సేవలను మరింత పెంచాలని అధికారులకు సూచించారు. రోగులకు మరింత నాణ్యమైన డైట్ను అందించాలని అధికారులను ఆదేశించారు.
పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్లలో రోగులకు ఏ రోజుకు ఆ రోజు పరీక్షలు జరిగి డాక్టర్లకు రిపోర్టులు వెళ్లాలని, రోజుల తరబడి రోగులు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా చూడాలని అధికారులకు గట్టిగానే చెప్పినట్లు తెలిపారు. రోగికి అవసరమైన పరీక్షలను 24 గంటల్లోనే జరిపి నివేదికలను సంబంధిత విభాగాలకు పంపాలని అధికారులను ఆదేశించారు. ఉస్మానియాలో ఫైర్ ఫైటర్ పరికరాలు కావాలని దవాఖాన అధికారులు అడిగారని, త్వరలోనే వాటిని సమకూరుస్తామన్నారు. ఇక ఉస్మానియా భవన నిర్మాణ అంశంలో కోర్టులో ఉందని, కోర్టులో సమస్య తీరిన వెంటనే భవన నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఇన్చార్జ్ హెచ్వోడీ డాక్టర్ నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.