మెదక్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మెదక్ పట్టణంలో రూ.4. కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం శివాలయం పక్కన స్వచ్ఛ భారత్ సృష్టి కర్త సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అలాగే పట్టణంలోని వెల్కమ్ బోర్డ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు రూ.50 లక్షలతో నిర్మించిన దోబీ ఘాటుకు శంకుస్థాపన చేశారు. రాందాస్ చౌరస్తాలో రూ.44లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.