హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో రూ.33 కోట్లతో మరో 800 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నామని, పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు చెప్పారు. నిలోఫర్ హాస్పిటల్లో రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన సీటీ-స్కాన్, నియోనాటల్ స్కిల్ ల్యాబ్ను ఆయ న సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిలోఫర్ దవాఖానకు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా రోగులు వస్తుంటారని ఈ నేపథ్యంలోనే రూ.33 కోట్లతో మరో 800పడకలను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు.
ప్రస్తుతం గుండెసమస్యలు వచ్చిన చిన్నారులను చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు పంపుతున్నారని, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నందున ప్రత్యేకంగా కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెప్పారు. అయితే ఈ విభాగాన్ని నిలోఫర్లో ఏర్పాటు చేయాలా లేక నిమ్స్లోనా అన్నదానిపై ఒక కమిటీని వేశామని చెప్పారు. కరోనా వైరస్ థర్డ్వేవ్ను దృష్టిలో పెట్టుకొని నిలోఫర్ హాస్పిటల్లో మరో సీటీ-స్కాన్ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. నవజాత శిశువులకు చికిత్స అందించే వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా నియోనాటల్ స్కిల్ ల్యాబ్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. టీ-డయాగ్నస్టిక్ సెంటర్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని, మిగిలిన 13 జిల్లాల్లో కూడా వాటిని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.10కోట్లు
నిలోఫర్కు ఆరోగ్యశ్రీ కింద ప్రతి సంవత్సరం రూ.10కోట్లు వస్తున్నాయని, ఈ నిధులను దవాఖాన అభివృద్ధికి వినియోగించే అధికారం సూపరింటెండెంట్కు కల్పించామని మంత్రి తెలిపారు. నిలోఫర్కు ఇతర రాష్ర్టాల నుంచి రోగులు వస్తున్నందున వారికి ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి హరీశ్ చెప్పారు. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, డీహెచ్లు మంగళవారం ములుగు, సిరిసిల్ల వెళ్తున్నారని, వారు ఇచ్చే నివేదిక ఆదారంగా త్వరలోనే హెల్త్ ప్రొఫైల్ను ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రిస్క్ దేశాల నుంచి వచ్చిన 15మందికి పాజిటివ్ వచ్చినప్పటికీ వారిలో ఒక్కరికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ రాలేదని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు ఓపీలో ఉండాల్సిందే
ప్రొఫెసర్లు, హెచ్వోడీలందరూ ఔట్పేషెంట్ విభాగంలో అందుబాటులో ఉండాలని, కేవలం పీజీలు, ఎస్ఆర్లపై వదిలేయడం సరికాదని మంత్రి హరీశ్ స్పష్టంచేశారు. ఓపీతోపాటు వారు ఆపరేషన్లు కూడా చేయాలని, తద్వారా పీజీ, ఎస్ఆర్లకు మంచి శిక్షణ ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు. సెల్ఫ్ అప్రైజల్ ఇవ్వాలని వైద్యులకు సూచించినట్లు తెలిపారు. నెల నెలా వాటిపై సమీక్షిస్తామన్నారు. సిబ్బందికి సంబంధించిన జీతాలు, మందుల విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.