సిద్ధిపేట : జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉచిత మీ సేవ కేంద్రాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. దరఖాస్తు చేసుకున్న కొద్ది గంటల్లోనే చేతికి అందిస్తామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామనీ, వివిధ విభాగాల్లో 20వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు, 501 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
సిద్ధిపేట కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఉచిత శిక్షణతో పాటు మెటీరియల్, భోజనం సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మీ సమయం వృథా కావొద్దని, ఓ వైపు శిక్షణ, మరో వైపు చదువుకు ఇబ్బంది కావొద్దనే ‘మీ సేవ’లు అందుబాటులో తెచ్చామని, విద్యార్థులు ఎలాంటి సర్టిఫికెట్ కావాలన్న ఇక్కడ కొద్దీ గంటల్లో జారీ చేయడం జరుగుతుందన్నారు.
ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సమయం వృథా కాకుండా ఈ మీ సేవ కేంద్రాలు ఉపయోగపడుతాయన్నారు. మీ సేవ కేంద్రాల్లో రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, విద్యార్థులు ఉదయం 7 గంటలకు వచ్చిన, సాయంత్రం 5 తర్వాత వచ్చిన ఇక్కడ సేవ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయనీ, ఈ మేరకు ఇంటర్వ్యూలను తొలగించిందన్నారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ఉద్యోగ నియామకాలు జరుగుతాయన్నారు.