మెదక్, నవంబర్ 23: రాష్ట్రంలో లక్షలమంది రైతుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాటం ఆడుతున్నారని ఆర్థికమంత్రి హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. మాటలు, చేతలతో రైతులను దారుణంగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యాసంగిలో రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకొంటామన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటనపై హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. మెదక్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘యాసంగి ధాన్యాన్ని ఉడికించకుండా మరాడిస్తే విరిగిపోయి నూకలు ఎక్కువ వస్తాయి. క్వింటాల్ వడ్లకు 67 కిలోల బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాలి ఉన్నది. యాసంగి ధాన్యాన్ని బియ్యం పట్టిస్తే క్వింటాల్ వడ్లకు 40 కిలోల నూకలు, 27 కిలోల బియ్యం వస్తాయి. బాయిల్డ్ రైస్ అయితే క్వింటాల్ వడ్లకు 68 కిలోలు వస్తాయి. రా రైస్ కొంటామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అంటున్నారు. నేరుగా మరాడిస్తే నూకలు ఎక్కువగా వస్తే మీరు కొంటరా? కేంద్రంలో గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ బాయిల్డ్రైస్ కొన్నాయి. ఇప్పుడు కూడా కొనాలి. వాస్తవాలను దాచిపెట్టి రెచ్చగొట్టే ప్రసంగాలతో మోసం చేస్తున్నది బీజేపీ నేతలు కాదా?’ అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రైతుల కోసం తపన పడుతుంటే బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి అన్నదాతల గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టంచేశారు. రైతుల జీవితాలు బాగుపడాలని సీఎం కేసీఆర్ తపన పడుతుంటే, ఇది మీకు రాజకీయంగా కనిపిస్తున్నదా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ తన ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పలేదని, పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని అన్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు తదితర అన్ని వర్గాలకు న్యాయంచేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు.
ఎస్సీ రిజర్వేషన్లను పెంచుకోవడం రాష్ర్టాల ఇష్టమని ఏ ప్రాతిపదికన చెప్తున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డిని హరీశ్రావు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్రానికి పంపితే ఎందుకు ఆమోదించడంలేదని నిలదీశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే రిజర్వేషన్ల పెంపు బిల్లుపెట్టాలని డిమాండ్చేశారు. మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని హరీశ్రావు స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా యాదవరెడ్డి నామినేషన్ వేసినట్టు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్యరావు, భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంప్రభుత్వం ధాన్యం సేకరణకు ససేమిరా అనటంవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పటంతో 16, 17 శాతం తేమ వచ్చిన తర్వాతే ధాన్యాన్ని మిల్లులకు పంపాల్సి వస్తున్నదని, దీంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. యాసంగిలో ఏ పంట వేయాలోనని రైతులు ఎదురుచూస్తున్నారని, దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్చేశారు.