జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా, కరీంనగర్ అక్టోబర్ 27: ‘హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైపోయింది. ఆయన 25 వేల ఓట్ల మెజారిటీ సాధించబోతున్నారు. బుధవారం ఉదయమే మనకు అందిన తాజా సర్వేల్లో ఈ విషయం తేటతెల్లమైంది’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఏ సర్వే చూసినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్తున్నదని, చివరికి బీజేపీ వాళ్ల సర్వేలో కూడా ఇదే తేలడంతో కొంత మంది ఆ పార్టీ నాయకులు ఫోన్లు నేలకేసి కొట్టుకుంటున్నారని తెలిపారు.
హుజూరాబాద్లో అహంకారానికి, అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతున్నదని అన్నారు. జమ్మికుంటలోని బిజిగిరిషరీఫ్లో బుధవారం నిర్వహించిన ధూంధాంకు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, బండా ప్రకాశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హుజూరాబాద్లో ముఖ్యమంత్రి సభ జరిగితే వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలున్నాయని ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై ఆయన్ను రాకుండా చేశారని విమర్శించారు. ఎన్ని రోజులని సీఎంను ఇక్కడికి రాకుండా ఆపగలరని బీజేపీని ప్రశ్నించారు. గెల్లు గెలిచిన రెండు వారాల్లో సీఎం కేసీఆర్ హుజూరాబాద్కు వచ్చి స్వయంగా మెడికల్ కాలేజీ ప్రకటన చేస్తారని, నియోజకవర్గానికి వరాల జల్లు కురిపిస్తారని అన్నారు.
నాగార్జునసాగర్లో జానారెడ్డిపై నోముల భగత్ గెలవగానే ఇచ్చిన మాట ప్రకారం ఆ నియోజకవర్గానికి వెళ్లి నీటి లిఫ్టులు, ఇతర అభివృద్ధి పథకాలను మంజూరు చేసి వచ్చారని గుర్తు చేశారు. జమ్మికుంట ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా మారిన రైల్వే బ్రిడ్జిని తీసేసి, మరొకటి కట్టించే బాధ్యత తనదని హరీశ్ భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత కారు గుర్తుకు, కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. ‘అసలు పేద ప్రజల కోసం మీరు (బీజేపీ) ఏం చేశారో.. మీ ఎందుకు ఓటేయ్యాల్నో ఒక్క కారణం చెప్పున్రి. గ్యాస్ ధరలను రూ.వెయ్యి చేసినందుకా? ఎన్నికలు అయిపోగానే మరో రూ.200 పెంచుతున్నందుకా? పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామన్యుడి నడ్డి విరుస్తున్నందుకు మీకు ఓటెయ్యాన్లా?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘నీకు సూటిగా మాట్లాడే దమ్ములేక చాటుకు అవాకులు, చెవాకులు పేలుతున్నావు. గ్యాస్పై సవాలు విసిరితే ముఖం చాటేశావు.
ధరల పెంపుపై గా కిషన్ రెడ్డిని రమ్మన్నా రాలేదు.. నేను వేసే సవాళ్లను స్వీకరించే దమ్ము లేని మీరు ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పి, నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు’ అని ఈటలపై హరీశ్రావు మండిపడ్డారు. ‘మొన్నటిదాకా వడ్లు కొనరని అసత్య ప్రచారం చేసి, ఇప్పుడు అన్ని ఊళ్లలో కాంటాలు అయితాంటె, మళ్లీ యాసంగిలో వరి వేయొద్దన్నట్టు కొత్త ప్రచారం చేస్తున్నరు. ఇయ్యాల జిల్లా కలెక్టర్ ప్రకటన చేసిండు. యాసంగిలో వరి వేసుకోవచ్చని. ఇక్కడ వరి పెద్ద మొత్తంలో పండుతాంది.. మీరు తప్పనిసరిగా వరి పంటను పండించుకోవచ్చు’ అని హామీ ఇచ్చారు. రైతులను కార్లలో తిప్పాలని టీఆర్ఎస్ చూస్తుంటే, బీజేపీ మాత్రం వారిని కార్లతో తొక్కించి చంపుతున్నదని మంత్రి హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశాం
హుజూరాబాద్ను సస్యశ్యామలం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీశ్ అన్నారు. నీళ్లు నిధులు, నియామకాల మీద సాగిన తెలంగాణ ఉద్యమం కల నెరవేరిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయని, మానేరుపై చెక్డ్యాంలు నిర్మించామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వీహెచ్పీ నుంచి సుమారు 150 మంది హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, లింగంపల్లి కిషన్రావు తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లూ జాగ్రత్త.. ఇక్కడా బీజేపీ దుబ్బాక కుట్ర
బీజేపీ నాయకులకు ఓటమి భయం పట్టుకున్నదని, వాళ్లు కొత్త కుట్రలకు తెరతీసే అవకాశం ఉన్నదని హరీశ్రావు అనుమానం వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. దుబ్బాక మాదిరి ఫేక్ వీడియోలు విడుదల చేసి హుజూరాబాద్ ప్రజలను గందరగోళంలో పడేసే పనిలో బీజేపీ నాయకులు ఉన్నారని అప్రమత్తం చేశారు. విజ్ఞులైన హుజూరాబాద్ ప్రజలు ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకుండా ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ మొదట్నుంచీ అబద్ధాలనే ప్రచారం చేసిందని, ప్రజల సమస్యల కోణం వాళ్ల ప్రచారంలో కనిపించలేదని విమర్శించారు. బీజేపీ ధరలు పెంచి, సామాన్యుడి నడ్డి విరిచిందని, అందుకే ‘గ్యాస్కు దండం పెట్టు, బీజేపీని బొంద పెట్టు, గెల్లు సీనుకు పట్టం కట్టు’ అనే నినాదంతో ముందుకెళ్లామని, దీనిపై మహిళల్లో మంచి స్పందన కనిపించిందని, బీజేపీపై గ్యాస్బండ పడటం ఖాయమని హరీశ్ స్పష్టం చేశారు.
నేను లెఫ్టిస్ట్ను అంటివి.. రైట్ సైడ్ తిరిగితివి
మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘లెఫ్టిస్ట్ను అంటివి. నా భావాలు వేరు, నా సిద్ధాంతాలు వేరు అని అంటివి. తిరిగి గా రాంగ్ సైడ్.. రైట్ బీజేపీల చేరితివి’ అని ఈటలను మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. 2009 కంటే ముందు ఇక్కడికి వస్తే మొత్తం ఎడారిగా కనిపించేదని, అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పుడు ఈ ప్రాంతమంతా కళకళలాడుతున్నదని అన్నారు. ఈటల ఇప్పుడెందుకు ఉప ఎన్నికను తెచ్చారని ప్రశ్నించారు. అందలం ఎక్కించిన వ్యక్తికే ఈటల వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. ‘ఇక్కడకొస్తే నా ఇంట్ల కులముంటాదే అంటవు. అక్కడ హైదరాబాద్లో మాత్రం నీకు కోడలు రెడ్డి, అల్లుడు రెడ్డి కావాలె’ అని చురకలేశారు.
హరీశ్ నోట ‘కారు గుర్తు కేసీఆర్’ మాట
బీజేపీ, ఈటల.. వీటికి జవాబులెక్కడ?