కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్వయంపాలనలో పల్లెల రూపరేఖలు మారాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన గ్రామాలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. గౌడ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ (CM KCR) దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వివరించారు.
మేరిమా యాడి పతాకావిష్కరణ చేసి భోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెళ్లి కానీ యువతులకు త్వరగా పెళ్లి కావాలని జరుపుకునేదే తీజ్ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్, జడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్, ఏఎంసీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.