హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలను సాధించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని, బలహీనవర్గాలకు ముందెన్నడూ లేనివిధంగా లబ్ధి చేకూరుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. సోమవారం ఫులే వర్థంతిని పురస్కరించుకుని ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన జ్యోతిబాఫులే చిరస్మరణీయుడని సోమవారం ఒక ప్రకటనలో పేరొన్నారు.
సీఎం కేసీఆర్ బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో 310 బీసీ గురుకులాలను మహాత్మా జ్యోతిబాఫులే పేరిట ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. 41 బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం హైదరాబాద్లో అత్యంత ఖరీదైన 87 ఎకరాల స్థలం కేటాయించారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలో బీసీల వాటాను సగర్వంగా అందిస్తున్నదని పేర్కొన్నారు.