హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రాసెసింగ్ పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో జపాన్కు చెందిన ప్రముఖ కంపెనీ సటాకే కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో మిల్లింగ్ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గత తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్ చేసిన కృషితో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పదిరెట్లు పెరిగిందని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో తెలంగాణ బ్రాండ్ను క్రియేట్ చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ధాన్యం దిగుబడి 24 లక్షల టన్నులు ఉండగా.. ఈ సీజన్లో కోటీ ముప్పై లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా సేకరించామని, ఇదే స్థాయిలో బహిరంగ మారెట్లోకి సైతం ధాన్యం తరలుతున్నదని వివరించారు. ఇంత భారీ స్థాయిలో ఉన్న ధాన్యం ఉత్పత్తికి తగ్గట్టుగా వేగంగా మిల్లింగ్ చేయడంతోపాటు ఉప ఉత్పత్తులకు సైతం ప్రపంచస్థాయి మారెటింగ్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి తగ్గుతుంటే తెలంగాణలో మాత్రమే పెరుగుతున్నదని, దీనిని సద్వినియోగం చేసుకొనే దిశగా ప్రభుత్వ ప్రణాళికలు ఉంటాయని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా సటాకే కార్పొరేషన్ ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి మంత్రికి వివరించారు. యూఎస్, యూకే, థాయ్లాండ్, చైనా, వియత్నాం తదితర వరి పండించే దేశాల్లో తమ కంపెనీ మిల్లింగ్ యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. అత్యధికంగా రోజుకు లక్ష టన్నుల వరకూ మిల్లింగ్ సామర్థ్యం ఉన్నదని చెప్పారు. మిల్లింగ్తోపాటు నిల్వ సామర్థ్యం, బాయిలర్ల పనితీరు, ఉప ఉత్పత్తులు తదితర అంశాలను మంత్రితో చర్చించారు. సమావేశంలో సివిల్ సైప్లె కమిషనర్ వీ అనిల్కుమార్, జపాన్ సటాకే కార్పొ రేషన్ డైరెక్టర్ ఆర్కే బజాజ్, ఏజీఎం హెచ్ సతీశ్కుమార్, డీలర్లు కే విఠల్, కే వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.