వరంగల్, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ మోసపూరిత, దగాకోరు పార్టీ అని, అబద్ధాలతో అందరినీ మోసం చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీ నేతలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, అందుకే అన్ని చోట్ల వారిని అడ్డుకొంటున్నారని చెప్పారు. ఏడున్నరేండ్లు దాటినా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండలో టీఆర్ఎస్ హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్, పాగాల సంపత్రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు బీజేపీ అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా నిలుస్తున్న మేడారం జాతరకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మేడారం జాతరకు ఇతర రాష్ర్టాల నుంచి ప్రజలు వస్తారన్న విషయం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డికి తెలియదా? అని అన్నారు. వ్యవసాయరంగం, అన్నదాతల కోసం సీఎం కేసీఆర్ అన్ని చేస్తున్నారని.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు మతితప్పి మాట్లాడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్పై, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని బీజేపీ నేతలను హెచ్చరించారు. ఇంతకాలం ఓపిక పట్టామని, ఇక నుంచి గట్టిగా సమాధానం చెప్తామన్నారు.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ డిమాండ్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీపై ప్రకటన రాకుంటే ఉద్యమంతో బీజేపీ నాయకుల మెడలు వంచుతామన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వరంగల్కు టూరిస్టులాగా వచ్చారని.. వెయ్యి స్తంభాల గుడికి ఏమీ చేశారని ప్రశ్నించారు. 60 లక్షల సభ్యత్వం ఉన్న టీఆర్ఎస్ను సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిరుగులేని రాజకీయ పార్టీగా తీర్చిదిద్దారని చెప్పారు.