హైదరాబాద్ : ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్, 61 ఏండ్ల వరకు ఉద్యోగ విరమణ వయసుని పెంచిన సందర్భంగా పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపపేని నరేందర్ తదితరులతో కలిసి అసెంబ్లీలోని సీఎం చాంబర్లో ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ఉద్యోగుల సమాజం మొత్తం సంతోషంగా ఉందన్నారు. వారు ఊహించిన దానికంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్న ఉద్యోగులందరికీ ఎప్పటికి మరచిపోని రీతిలో సీఎం కేసీఆర్ పీఆర్సీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.