హైదరాబాద్ : వరదలు, రహదారులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ కలెక్టర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందుల్లేకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి, పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. వరద నిర్వహణ కోసం శాశ్వత ప్రాతిపదికన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. విష జ్వరాలు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
గ్రామాల్లో నిరంతరం శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. గతేడాది కురిసిన వర్షాలకంటే ఈ సంవత్సరం నష్టాన్ని తగ్గించగలిగామన్నారు. యుద్ధ ప్రాతిపదికన గ్రామీణ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లు, రోడ్ల గురించి అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలను ప్రతి రోజూ శుభ్రం చేయాలని, విద్యార్థులకు.. ఉపాధ్యాయులు కరోనా బారినపడకుండా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు.
ప్రతి పాఠశాల కు ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. ఈ సంవత్సరం విద్యాశాఖకు రూ.8వేలకోట్లు కేటాయించారని.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ హన్మకొండలోని అమరావతినగర్, సమయ్యనగర్లో స్మార్ట్ సిటీ పెండింగ్ రోడ్డు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హన్మకొండ కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. జిల్లాల్లో వర్షపాతం సగటున 17శాతంగా ఉందన్నారు. వరంగల్ కలెక్టర్ గోపీ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సౌకర్యం పునరుద్ధరించినట్లు చెప్పారు. జిల్లాల్లో 800 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయని చెప్పారు.
సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్లు డాక్టర్ సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికాయల రాజయ్య, ఆరూరి రమేశ్, సీపీ తరుణ్ జోషి, గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, వరంగల్ అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, హనుమకొండ, వరంగల్ ఆర్డీవోలు వాసు చంద్ర, మహేందర్, హన్మకొండ, వరంగల్ జిల్లాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.